సాక్షి, గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరులో విజయవంతంగా కొనసాగుతోంది. 124వ రోజు శుక్రవారం ఉదయం పెదకూరపాడు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. వైఎస్ జగన్ వెంట జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రగా వస్తుండగా సమీప పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాజన్న తనయుడికి ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. తమ కష్టాలు, సమస్యలు చెప్పుకుంటున్నారు.
ఈరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాటిబండ్ల, ముస్సాపురంలో వైఎస్సార్సీపీ జెండాలను జగన్ ఆవిష్కరిస్తారు. భోజనం విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు వైఎస్ జగన్ తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం సిరిపురం మీదుగా సరిపుడి చేరుకుంటారు. శుక్రవారం రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.