ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి

10 Oct, 2013 04:06 IST|Sakshi
భువనగిరి, న్యూస్‌లైన్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలో బుధవారం ఏర్పాటు చేసిన యువగర్జన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల భూమి సాగు నీరు లేక బీడుపడిపోయిందన్నారు. ఇందులో నల్లగొండ జిల్లా కూడా ఉందన్నారు. కేంద్రం పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లుగానే ప్రాణహిత చేవెళ్లకు కూడా ఆ హోదా కల్పించాలని కోరారు. ఆనాటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్న నల్లగొండ జిల్లా నేటి తెలంగాణ ఉద్యమంలోనూ అగ్రభాగాన ఉందని చెప్పారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని కాంగ్రెస్ నాయకులు జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లాకు చెందిన రాష్ర్టమంత్రి కుందూరు జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. తెలంగాణ విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదని చెప్పారు.
 
 కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ ఇచ్చిన మద్దతుతోనే రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయకపోతే బీజేపీ మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. వెయ్యిమంది చంద్రబాబులు, కిరణ్‌బాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు.అంతకుముందు పీవీ పౌండేషన్ అధినేత పీవీ శ్యాంసుందర్‌రావుకు కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సభ్వత్యం ఇచ్చారు. పడమటి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, పుష్పలీల, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు పాశం భాస్కర్,  పోతంశెట్టి రవీందర్, గోలి మధుసూదన్‌రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, కసిరెడ్డి నర్సింహారెడ్డి, నర్ల నర్సింగరావు, చందా మహేందర్, సుర్వి శ్రీనివాస్, వేముల అశోక్, విజయపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు