గర్భిణులను గెంటేస్తున్నారు

15 Nov, 2013 05:50 IST|Sakshi

 దేవునిపల్లి, న్యూస్‌లైన్ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లాలంటేనే గర్భిణులు జంకుతున్నారు. పురిటి నొప్పులతో ఆస్పత్రిలో అడుగు పెట్టగానే మత్తు వైద్యుడు లేడు.. స్త్రీ వైద్య నిపుణురాలు అందుబాటులో లేదు.. సిజేరియన్ చేయడానికి వైద్యులు అందుబాటులో లేరు.. బయట వేరే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లండి లేకపోతే, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ అస్పత్రికి రాసిస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ గర్భిణుల బంధువులు ఎవరైనా గట్టిగా నిలదీస్తే బయటకు గెంటి వేస్తున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లలో బుధవారం రాత్రి 10 గంటలకు కామారెడ్డి పట్టణానికి చెందిన సీహెచ్. రాధ అనే గర్భిణి, భిక్‌నూర్ మండలం, పెద్ద మల్లారెడ్డి గ్రామ పరిధిలోని, అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన వరాల్ల రేణుక పురిటి నొప్పులతో వచ్చారు. వీరిని చూసిన వెంటనే నర్సులు  ఇక్కడ మత్తు మం దు డాక్టర్ లేడు నిజామాబాద్ ఆస్పత్రికి రాసిస్తామని అన్నారు.
 
 గర్భిణుల బంధువులు భర్త లు సతీష్, బాల్‌రాజు కలిసి నర్సులను గట్టిగా నిలదీయగా వారందరిని బయటకు గెంటి వేసారు. చేసేదేమీ లేక  వారు చలికి ఆస్పత్రి బయట వణకుతూ గంటల తరబడి కూర్చున్నారు. ఆర్డీఓకు ఫోన్ చేస్తే వైద్యులు ఏలా చెప్తే అలా వినండి అంటూ సమాధానం చెప్పారని బాధితులు ‘న్యూస్‌లైన్’తో వాపోయారు. చేసేదేమి లేక రాధను బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.  రేణుకు మా త్రం అక్కడి నుంచి వెళ్లక పోవడంతో ఆస్పత్రిలో చేర్చుకున్నా ప్రసూతి గురించి మాత్రం బంధువలకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కామారెడ్డి పరిధిలోని 108 ఆంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా ఈ సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో తాము గ్రామాల నుంచి గర్భిణులను తీసుకుని వచ్చినా నర్సులు ఆపరేషనలు చేయలేమని చెబుతున్నారని తెలిపారు.  
 
 బయటకు పంపించారు
 -సతీష్, గోసంగి కాలని, కామారెడ్డి.
 నా భార్య రాధను పురిటి నొప్పులతో తీసుకువచ్చాము. మత్తు డాక్టర్ లేడని, నిజామాబాద్‌కు రాసిస్తాము, వెళ్లమని నర్సులు సూచిం చారు. మేము గట్టిగా మాట్లాడితే గెంటేశారు.. నేను మేస్త్రి పని చేస్తాను. ఇలా సార్కారు దవాఖానాలో సౌకర్యాలు లేక పోతే మాలాం టి వాళ్లు ఎటు పోవాలే. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలే. ఇంత పెద్ద ఆస్పత్రి ఉండి ఏందుకు...అసలు మొత్తానికే కాన్పులు చేయమని బోర్డులు పెడితే సరిపోతుంది కదా మా సావు మేం సస్తాం. ఎందుకు సర్కారు ఆస్పత్రికి రమ్మంటున్నారు మరి. ఆర్డీఓకు ఫోన్ చేస్తే డాక్టరు ఎలా చెబితే అలా చేయాలి అంటూ పెట్టేసారు.
 
 అడ్మిటైతే చేసుకున్నారు..
 -బాల్‌రాజు, అయ్యవారిపల్లి, భిక్‌నూర్
 నేను ఐకేపీలో విధులు నిర్వహిస్తున్నాను. నాభార్యకు పురిటి నొప్పులు వస్తే కాన్పు కోసం తీసుకువచ్చాను.
  నర్సులు చూడకుం డానే  ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమన్నారు.  నేను ఆర్డీఓకు ఫోన్ చేసాను. గట్టిగా మాట్లాడితే అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు. ఆపరేషన్ అంటే మరి భయంగా ఉం ది. మత్తు డాక్టర్ లేరని బయటకు పంపుతారో ఏమో..
 

మరిన్ని వార్తలు