కరస్పాండెంట్ అకృత్యం: ఏడో తరగతి విద్యార్థినికి గర్భం

8 Jul, 2015 18:46 IST|Sakshi
కరస్పాండెంట్ అకృత్యం: ఏడో తరగతి విద్యార్థినికి గర్భం

దర్శి (ప్రకాశం): ఓ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు! ఫలితంగా 7వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అనారోగ్యంగా ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ అఘాయిత్యం వెలుగు చూసింది.  ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. వివరాలు..  దర్శిలోని తూర్పు చవటపాలెం రోడ్డులో నివసించే 14 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. మామయ్య సంరక్షణలో ఉన్న ఆమె స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతోంది.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బుధవారం బంధువులు ఒంగోలులోని రిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆరు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె బంధువులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు ఇస్తానని ప్రిన్సిపాల్ జాయ్ తనను లొంగదీసుకున్నట్టు బాధితురాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ విద్యార్థిని గతేడాది అదే స్కూల్లో 3వ తరగతి చదివింది. అయితే, నేరుగా 7వ తరగతిలో చేర్పించి బాగా చదివిస్తానని కూడా ప్రన్సిపాల్ ఆశ చూపినట్టు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ జాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, బాలికతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వ్యాసెక్టమీ సర్జరీ చేయించుకున్నానని, తన వల్ల గర్భం వచ్చే అవకాశమే లేదని ప్రిన్సిపాల్ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కేసుకు సంబందించి పోలీసులు అధికారికంగా మీడియాకు ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

మరిన్ని వార్తలు