ప్రేమజంట బలవన్మరణం

4 Mar, 2014 04:01 IST|Sakshi

 మేళ్లచెర్వు,
 మండలంలోని కీర్తి సిమెంట్ పరిశ్రమ పరిధిలో ఉరి వేసుకొని ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఎస్‌ఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన చిన్నపంగు శౌరి కూతురు మౌనిక (18)  రెండేళ్లుగా కీర్తి పరిశ్రమ గేటు ఎదురుగా డబ్బాకొట్టు నిర్వహిస్తున్నది. మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన గుణకుంట వీరస్వామి (30) కీర్తి పరిశ్రమలో లోడింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరస్వామికి పెళ్లయింది. భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, మౌనిక, వీరస్వామి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి వీరి ఇరువురి కలిసి సిమెంట్ పరిశ్రమ పక్కన గల వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం  పరిశ్రమలో డ్యూటీ దిగి అటుగా వెళ్తున్న కొంతమంది కార్మికులు చూసి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు.

మృతదేహాలను కిందికి దించి చూడగా వీరస్వామి షర్ట్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. అందులో మా చావుకి ఎవరూ కారకులు కారని తమ వాళ్లను ఎటువంటి ఇబ్బందులకూ గురిచేయవద్దని,  ఇద్దరికీ ఒకేచోట దహనసంస్కారాలు చేయాలని రాసి ఉంది. విషయం తెలుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోసుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
 

అయ్యో..పాపం

 వీరస్వామి మృతదేహం వద్ద అతని భార్య, పిల్లలు ఏడుస్తున్న తీరు గ్రామస్తులను కలిచివేసింది. మృతుడికి నాలుగేళ్ల, నాలుగు నెలల వయస్సుగల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక ఆ పిల్లలు ఆమెవైపు దీనంగా చూస్తుండడంతో స్థానికులు అయ్యో.. పాపం అంటూ కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు