ఇక ఆటోలో ప్రయాణం..సులభతరం.. సురక్షితం

13 Oct, 2017 08:53 IST|Sakshi
ప్రీ పెయిడ్‌ ఆటో బూత్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌

ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రీ పెయిడ్‌ ఆటో బూత్‌ ప్రారంభం

త్వరలో రైల్వేస్టేషన్‌లో కూడా ఏర్పాటు

జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌

అనంతపురం సెంట్రల్ : అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో దిగే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడే విధంగా ప్రయాణ చార్జీలు వసూలు చేసే ఆటో డ్రైవర్లకు కళ్లెం వేస్తూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. మహానగరాల తరహాలో ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రీ పెయిడ్‌ ఆటో బూత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ... ప్రయాణికుల ఆటోలలో రాకపోకలను సులభతరంతో పాటు సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు ప్రీ పెయిడ్‌ ఆటో బూత్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి గమ్యస్థానాలకు ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రయాణికులు, ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీలో ఈ ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రయాణికులు నేరుగా సెంటర్‌ వచ్చి వారు పోవాల్సిన చిరునామాకు టికెట్‌ తీసుకోవచ్చని చెప్పారు. ముందే ధరలు నిర్ణయించడంతో ఇష్టానుసారం వసూలు చేయడానికి కుదరదన్నారు.

అంతేకాకుండా అర్ధరాత్రి మహిళలు బస్టాండ్‌లో దిగితే సురక్షితంగా గమ్యాన్ని చేరచ్చని చెప్పారు. సదరు ప్రయాణికురాలు ఏ ఆటో ద్వారా వెళ్తున్నారనే సమాచారం ముందే తెలిసిపోన్నారు. దీని వలన నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. నగరాన్ని ఎనిమిది రూట్‌లుగా విభజించడం జరిగిందన్నారు.  ఒకటిన్నర కిలోమీటరుకు రూ. 25లు నిర్ణయించడం జరిగిందని, ఆ తర్వాత అదనపు చార్జీలు పడుతుందన్నారు. నగరంలో శివారు ప్రాంతానికి కూడా రూ. 150లు మించి ఉండదని తెలిపారు. దీని వలన ప్రయాణికునికి, ఆటో నిర్వాహకునికి ఇద్దరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కేంద్రం 24 గంటలు పనిచేస్తుందన్నారు.  త్వరలో రైల్వే స్టేషన్‌లో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీఎస్పీ నర్సింగప్ప, కార్పొరేషన్‌ కమిషనర్‌ మూర్తి, ఎంవీఐ రమేష్, సీటీఎం గోపాల్‌రెడ్డి, డీఎం బాలచంద్రప్ప సీఐలు, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు