-
సాక్షి, తిరుమల : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వరాహ స్వామిని దర్శించుకుని, అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డితో పాటు ఆలయ అర్చకులు ఇస్తికపాల్ తదితరులు ప్రథమ పౌరుడికి స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో చేయగా, ఈవో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ, ప్రసాదాలు అందచేశారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ దంపతులు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాగా రాష్ట్రపతి మధ్యాహ్నం మూడు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీహరికోట వెళతారు.