డీఐజీ మురళీకృష్ణకు రాష్ట్రపతి మెడల్

26 Jan, 2014 03:29 IST|Sakshi

కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు శాఖలో విశేష ప్రతిభ కనపర్చిన కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు పోలీసు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం సాయంత్రం మెడల్స్ దక్కించుకున్న పోలీసు అధికారుల జాబితా విడుదల చేసింది. ఆక్టోపస్ విభాగంలో ఎస్పీగా ఉన్న మురళీకృష్ణకు గత ఏడాది మే 23న డీఐజీగా పదోన్నతి కల్పించి కర్నూలు రేంజ్‌కు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
 
 ఈ మేరకు ఆయన 2013 మే 31న డీఐజీగా విధుల్లో చేరారు. 1987వ సంవత్సరం గ్రూప్-1 పరీక్షలో ఎంపికై పోలీసు శాఖలో చేరిన మురళీకృష్ణ వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 1998లో ఐపీఎస్‌కు ఎంపికై పోలీస్ అకాడమి హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో పనిచేశారు. గతంలో ఉత్తమ సేవా పతకం, మహోన్నత పతకం, ఇండియన్ పోలీస్ మెడల్, ఐక్యరాజ్య సమితి మెడల్ అందుకున్నారు. అత్యున్నతమైన పోలీసు పురస్కారానికి ఎంపికైన డీఐజీ మురళీకృష్ణకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు