టీడీపీ నేతల దౌర్జన్యం

8 Apr, 2019 09:59 IST|Sakshi
సంఘటనలో గాయపడిన వెంకటేష్‌రెడ్డి 

సాక్షి, రామచంద్రాపురం: ఓ పత్రికా విలేకరి బరితెగించాడు. వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యయత్నంకు ప్రయత్నించాడు. అడ్డుకున్న దళిత నాయకుడిని కులం పేరుతో దూషించాడు. బాధితుడు చేసిన పాపం ఏంటంటే టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి చేరడమే. రామచంద్రాపురం మండలం అనుప్పల్లికి చెందిన గుర్రప్ప ఓ పత్రికలో తిరుపతి విలేకరిగా పనిచేస్తున్నాడు. ఆదివారం అనుప్పల్లిలో టీడీపీ అభ్యర్థి నాని ప్రచార కార్యక్రమంలో గుర్రప్ప టీడీపీ కార్యకర్తగా వ్యవహరించాడు.

ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన వెంకటేష్‌రెడ్డి ఓటును తొలగించాలని గుర్రప్ప ఫారం– 7ను పెట్టాడు. దీనిపై వెంకటేష్‌రెడ్డి ఆదివారం అనుప్పల్లిలో గుర్రప్పను ప్రశ్నించాడు. ‘టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఎలా చేరతావు అంటూ గుర్రప్ప ఆగ్రహాంతో వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేశాడు. గుర్రప్పతో పాటు అతని బంధువు, మరో పత్రికా విలేకరి దేవా, టీడీపీ నాయకులు మున్నా, జానకీరాంలు తీవ్రంగా కొట్టారు.

వెంకటేష్‌రెడ్డిని కింద పడేసి పెద్ద బండరాయిని ఎత్తి అతని ముఖంపై వేసేందుకు గుర్రప్ప ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న దళిత నాయకుడు నాదముని వారించాడు. ఆగ్రహాంతో ఊగిపోయిన గుర్రప్ప నాధమునిని కులం పేరుతో దూషించాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాధముని, వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదుల మేరకు వెర్వేరుగా కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు రామచంద్రాపురం పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు