ధర తగ్గింది ‘చింత’ పెరిగింది

10 Mar, 2015 02:37 IST|Sakshi

మడకశిర : చింతపండు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలోనే మడకశిర నియోజకవర్గం చింత పండు ఉత్పత్తిలో ప్రసిద్ధి. ఈ ప్రాంతం రైతులు వేరుశనగ పంట సాగు చేసి నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఈ చింత పండు అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు వారాల నుంచి చింత పండు ధర తగ్గడంతో రైతుల పరిస్థితి కడుదయనీయం గా మారింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని రైతులు రెండు రకాల చింత పండును ఉత్పత్తి చేస్తున్నారు.

ఇందులో కర్పుడి మొదటి రకం చింత పండు. రెండో రకం ఫ్లవర్ చింత పండు. చింత పండు సీజన్ ప్రారంభంలో మొదటి రకం (కర్పుడి) చింత పండు క్వింటాల్ ధర రూ.12వేల వరకు పలి కింది. అయితే ప్రస్తుతం ఈ ధర రూ.7,500లకు పడిపోయిం ది. క్వింటాల్‌పై రూ.4,500 తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా రెండో రకం (ఫ్లవర్)చింత పండు ధర ప్రారంభంలో రూ.8వేల వరకు పలికింది. ప్రస్తుతం ఈ ధర రూ.4,500 పడిపోయింది. క్వింటాల్‌పై రూ.3,500 తగ్గడంతో రైతులకు శాపంగా మారింది. చింత పండు ధర మార్కెట్‌లో నిల కడగా లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
 
కొంపముంచిన వర్షం
నియోజకవర్గంలో అకాల వర్షం రైతుల కొంప ముంచింది. ఈ వర్షంతో చింత పండు రంగు మారింది. దీంతో నాణ్యత తగ్గడంతో రైతులు నష్టపోవడానికి కారణమైంది. అంతే కాకుండా చింత పండు ధర తగ్గినా కూడా కూలీల ధరలు తగ్గలేదు. దీంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం చెట్లలో చింత పండు కోయడానికి రోజుకు రూ.300 కూలీ చెల్లిస్తున్నా రు. అదేవిధంగా ఇలా కోసిన చింతకాయలను ఏరడానికి రోజుకు రూ.200 కూలీ ఇస్తున్నారు. చింత పండు ధర తగ్గడం కూలీ ధరలు అలాగే ఉండటంతో రైతులు నష్టాల బాట పట్టారు.
 
మడకశిరలో మార్కెట్ సౌకర్యం నిల్
మడకశిరలో చింత పండు మార్కెట్ లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. గతంలో మడకశిర మార్కెట్ యార్డులో చింత పండు క్రయవిక్రయాలు జరిపేవారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన త ర్వాత క్రయవిక్రయా లు ఆగిపోయాయి. అంతే కా కుండా ఇంత వరకు మార్కెట్ యార్డుకు ప్రభుత్వం పాలక వర్గాన్ని కూడా నియమించలేదు. దీంతో ఈ ప్రాంతం రైతులు చింత పండును హిందూపురం మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులను రైతులు ఎక్కువగా భరించాల్సి వస్తోంది. హిందూపురం మార్కెట్‌లో దళారుల బెడద అధికంగా ఉంది. కమీషన్ అధికంగా వసూలు చేస్తుండటంతో చింత పండు రైతులు నష్టపోవడానికి మరోకారణంగా మారింది. ఏదిఏమైనా చింత పండు ధరలు తగ్గుముఖం పట్టడం రైతులకు శాపంగా మారిందనడంలో సందేహం లేదు.
 
నష్టపోతున్నాం..
చింత పండు ధర తగ్గడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రారంభంలో చింత పండు ధర ఆశాజనకంగా ఉండేది. అయితే గత రెండు వారాల్లో చింత పండు ధర తగ్గడంతో నష్టం వస్తోంది. అంతే కాకుండా స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో మరింత ఆర్థిక భారం పడుతోంది. మడకశిర మార్కెట్‌యార్డులో చింత పండు క్రయవిక్రయాలు జరపాలి. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని చింత పండు రైతులను ఆదుకోవాలి.   
   - రఘునాథ్‌రెడ్డి, చింత పండు రైతు, పాపసానిపల్లి

మరిన్ని వార్తలు