పూజలు చేస్తూ శివలింగం చెంతనే...

15 Jun, 2018 16:49 IST|Sakshi

సాక్షి, భీమవరం: పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. గర్భగుడిలో స్వామివారికి పూజలు చేస్తూ ఆలయ ప్రధాన అర్చకుడు కందుకూరి వెంకటరామారావు శివలింగంపైనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందడంతో గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెంది ఉంటారని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  
 
పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నట్టుండి కిందపడిపోయిన వెంకటరామారావు మరో అర్చకుడి సాయంతో లేచి నిల్చున్నారు. అయితే మళ్లీ కాసేపటికే ఆయన శివలింగం చెంతనే పడిపోయారు. గుడిలోని అర్చకులు అప్రమత్తమయ్యే లోపల ఆయన ప్రాణాలు వదిలినట్టు తెలుస్తోంది. గర్భగుడిలోని సీసీ కెమెరాలలో రికార్డైన ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఆరోజు ఏంజరిగిందనే దానిపై అధికారులు  విచారణ జరుపుతున్నారు.

 

మరిన్ని వార్తలు