గిట్టుబాటు ధర ఇవ్వని ప్రైవేటు డెయిరీలు

1 Feb, 2020 12:09 IST|Sakshi

వెన్నశాతం పేరుతో తక్కువ ధరకు కొనుగోలు  

నష్టపోతున్న పాడిరైతులు   

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు దోపిడీ చేస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా మొండి చేయి చూపుతున్నాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి చితికి పోతోంది. వెన్నశాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయిస్తూ  పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. ఇందులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ కూడా భాగస్వామ్యం కలిగి ఉందని పాడి రైతులు ధ్వజమెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు డెయిరీలు పుట్టుకొచ్చాయి. అవి చేస్తున్న దోపిడీ వ్యాపారాలను పట్టించుకోక పోవడంతోనే నేటి ధరలు  పాడి రైతులకు శాపంగా మారాయి.

జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 1.50 లక్షల మంది  పంటల సాగు, పాడి పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆవులు 1,38,132, బర్రెలు 4,57,504 ఉన్నాయి. ఇందులో పాలిచ్చే ఆవులు 46,485,  బర్రెలు 1,50,658 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2,25,900 లీటర్ల నుంచి 2,32,625 లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 90,832 లీటర్ల నుంచి 1,05,658 లీటర్ల పాలను రైతులు గ్రామాల్లోని, పట్టణాల్లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా మిగతావి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువుల కాపాడుకుంటున్నారు.  కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను నిలువునా దోచుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. లీటరు పాలకు సాలీడ్‌ నాన్‌ ఫ్యాట్‌ (ఎస్‌ఎన్‌ఎఫ్‌), ఫ్యాట్‌ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం,  ట్యాక్స్‌ల పేరుతో మరికొంత  కోత కోస్తున్నారు. సాధారణంగా పాలను కొలత పాత్రలో పోసి ల్యాక్టో మీటరు (ఎల్‌ఆర్‌) ఆధారంగా ఎస్‌ఎన్‌ఎఫ్‌ 8.5 శాతం, ఫ్యాట్‌ 4.5 మేరకు రీడింగ్‌ వస్తే లీటరుకు రూ.35 నుంచి 40లు నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.25 నుంచి 27లు వరకు మాత్రమే ధరను నిర్ణయించి ఇస్తున్నారు. 

రైతులను నిలువు దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను చేస్తున్నాయి. ఇవి రోజుకు 1,35,068 లీటర్ల నుంచి 1,26,967 లీటర్ల పాలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. 

దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పాడి రైతు తేజోమయం...:2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చి వారి కు టుంబాల్లో సంతోషం నింపారు. 2006లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో  పాల శీ తలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలను ఏర్పాటు చే యించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలు, పోషకా ల మందులు ఇచ్చేవారు మొత్తం 1.20 లక్షల లీట ర్ల  పాలను విజయా డెయిరీ వారు సేకరణ చేసేవారు. పాడి రైతులకు ఎంతో ఊరట లభించేది.  

చంద్రబాబు స్వలాభం కోసం విజయా డెయిరీ నిర్వీర్యం  
జిల్లాలో తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  తన కుటుంబం నిర్వహిస్తున్న హేరిటేజ్‌ అభివృద్ధి కోసం నిర్వీర్యం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల కుటుంబాల రైతులు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నారు. 1999లో, 2014 లోనూ తన సొంత హెరిటేజ్‌ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నిలువునా ముంచారు. బాబుగారి హెరిటేజ్‌ సంస్థ లీటరు పాలను ఎన్నికల ముందు వరకు రూ.52లతో ప్యాకెట్‌ను విక్రయించారు. ఎన్నికలు ముగియగానే దాన్ని కాస్తా రూ.54  చేశారు. ప్రస్తుతం లీటరు పాల ప్యాకెట్‌ ధర రూ.60  చేశారు. మిగతా డెయిరీలు కూడా లీటరు రూ.60 ధరతో ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇది దోపిడీ కాదా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుల వద్ద మాత్రం లీటరుకు రూ.25 నుంచి 27లకు కొనుగోలు చేసి అధిక లాభంతో అవే పాలను ప్యాకెట్లు చేసి విక్రయిస్తారా? అని ధ్వజమెత్తుతున్నారు. 

పోషణ భారంగా మారింది...
ప్రైవేటు డెయిరీల పాలదోపిడీతో పాడి పశువుల పోషణ భారంగా మారింది. గతిలేని పరిస్థితిలో ఆ డెయిరీలకు పాలను పోస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడి రైతులకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించారు.మాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి.   ప్రైవేటు డెయిరీలను కట్టడి చేయాలి.  ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీ పాలను సేకరించేలా చూడాలి. – కె.చిన్నమ్మ,పాడిరైతు, ఎస్‌ సోమవరం, సంబేపల్లె మండలం.

నాటి ప్రభుత్వంనిలువునా ముంచింది...
టీడీపీ ప్రభుత్వం పాలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీని నిర్వీర్యం చేయించారు. ప్రైవేటు డెయిరీలు పట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చేలా ప్రోత్సహించారు. దీంతో పాడి రైతులు గిట్టుబాటు కాక పాలను ఇప్పటికీ తెగనమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు ఆర్ధికంగా చితికి పోతున్నారు.– సుబ్బారెడ్డి, పాడి రైతు, వెంకట్రామ్‌పల్లె, చింతకొమ్మదిన్నె మండలం. 

మరిన్ని వార్తలు