ప్రారంభమైన విశాఖ రైల్వే జోన్‌ పనులు

5 Feb, 2020 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేట్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పబ్లిక్‌ ప్రైవేట్‌  భాగస్వామ్య పద్ధతిలో  దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11  రూట్లలో  ప్రైవేట్‌ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలందజేయనున్నాయి. మరోవైపు ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు మధ్య తేజాస్‌ రైలు  ప్రవేశపెట్టనున్నారు. చర్లపల్లి టర్మినల్‌ విస్తరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో  రూ.5 కోట్లు కేటాయించగా, ఎంఎంటీఎస్‌ రెండో దశకు  రూ.40 కోట్లు  ఇవ్వనున్నట్లు  పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఘట్కేసర్‌-యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకు కేంద్రం ఈ బడ్జెట్‌లో  కేవలం రూ.10 లక్షలు కేటాయించడం గమనార్హం. మొత్తంగా గత నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేరకు నిధులు కేటాయించడం మినహా ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టులను  ప్రతిపాదించలేదు. (కిసాన్ రైలు)

ఎయిర్‌లైన్స్‌ తరహాలో ​ ప్రైవేట్‌ రైళ్లు...
ఎయిర్‌లైన్స్‌ తరహాలో  ప్రైవేట్‌రైళ్లు  అందుబాటులోకి రానున్నాయి. ట్రాక్‌ల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ,  రైళ్ల భద్రత,లొకోపైలెట్‌లు, గార్డులు,  సిబ్బంది వంటివి మాత్రమే  రైల్వే పరిధిలో ఉంటాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, ఆన్‌బోర్డు సేవలు,రైళ్ల పరిశుభ్రత, వైఫై సేవలు  వంటివి ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఎయిర్‌లైన్స్‌  పలు  ప్రాంతాలకు  ఫ్లైట్‌ సర్వీసులను నడుపుతున్నట్లుగానే  పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో  ప్రైవేట్‌  రైళ్లు  నడువనున్నాయి. టిక్కెట్‌ల రిజర్వేషన్‌లు ఆన్‌లైన్‌ పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్‌ కేంద్రాల నిర్వహణ పై ఇంకా స్పష్టత రాలేదని జీఎం  చెప్పారు.  

దేశవ్యాప్తంగా  100 రూట్లలో  150 ప్రైవేట్‌ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారమన్‌  ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ  క్రమంలోనే నగరం నుంచి వివిధ మార్గాల్లో  ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టర్మినల్‌ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి-శ్రీకాకుళం, చర్లపల్లి-వారణాసి, చర్లపల్లి-పన్వేల్‌, లింగంపల్లి-తిరుపతి,సికింద్రాబాద్‌-గౌహతి, చర్లపల్లి-చెన్నై, చర్లపల్లి- షాలిమార్‌, విజయవాడ-విశాఖ, తిరుపతి-విశాఖ, తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్‌ రైళ్లు  అందుబాటులోకి రానున్నాయి. (బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!)

అలాగే  ఐఆర్‌సీటీసీ  ఆధ్వర్యంలో  లింగంపల్లి-గుంటూరు, ఔరంగాబాద్‌-పన్వేల్‌ మధ్య  తేజాస్‌  రైళ్లను నడుపుతారు. ఈ రైళ్లలో కొన్ని డైలీ ఎక్స్‌ప్రెస్‌లుగాను, మరి కొన్ని వారానికి రెండు సార్లు చొప్పున తిరుగుతాయి. కొన్ని రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు గా నడుపుతారు.ఈ  రైళ్ల కోసం త్వరలో ఓపెన్‌ టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే దశలవారీగా  వీటిని పట్టాలెక్కేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. 

11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు
చర్లపల్లి-వారణాసి
లింగంపల్లి-తిరుపతి
చర్లపల్లి-పర్వేలి
విజయవాడ-విశాఖపట్టణం
చర్లపల్లి-శాలిమార్
ఔరంగబాద్-పన్వెలి
సికింద్రాబాద్-గౌహతి
చర్లపల్లి-చెన్నయ్
గుంటూరు-లింగంపల్లి

ఈ రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే అవకాశం 
గుంటూరు-లింగంపల్లి
ఔరంగబాద్-పన్వెలి
చర్లపల్లి-శ్రీకాకుళం

మరిన్ని వార్తలు