ఈ వేగం..ఏ గమ్యానికి ?

31 Oct, 2013 02:47 IST|Sakshi
 సాక్షి, రాజమండ్రి :అధునాతన వాహనాలను ప్రయాణంలో సౌకర్యానికి కాక వేగానికి ఉపయోగించాలనే ధోరణి పెరగడం వల్లే మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను, నిబంధనలను గాలికి వదిలేసి అపరిమిత వేగంతో బస్సులు దూసుకుపోతున్నా పట్టించుకోని నిర్లక్ష్యానికి సాక్ష్యమే పాలమూరు దుర్ఘటన . వేలాదిమంది ప్రాణాలతో రోజూ సాగే ఈ చెలగాటం నిరాటంకంగా సాగిపోతున్నా నియంత్రించాలనే స్పృహ పాలకులకు లేకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు తరచు సంభవిస్తున్నాయి. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన ఓల్వో బస్సు ప్రమాదం.. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణాలు ఎంతవరకూ భద్రం అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. 
 
 టూరిస్టు ట్రావెల్స్ అనుమతుల్లో అధిక శాతం బస్సులు డెయిలీ సర్వీసులుగా నడుస్తున్నాయి. వీటిటిలో పలు రాజకీయ పార్టీల నేతలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మిగిలిన ట్రావెల్స్ నిర్వాహకులు కూడా ఆయా ప్రాంతాల నేతలతో సత్సంబంధాలు ఉన్నవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రావెల్స్ నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. బెంగళూరు- హైదరాబాద్ మార్గంలోలాగానే విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే ప్రైవేట్ సర్వీసులు కూడా అంతే స్థాయిలో తిరుగుతాయి. ఇప్పుడు ఈ మార్గంలో కూడా ప్రైవేట్ ప్రయాణాలను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
 హైదరాబాద్ వెళ్లేవారు ఎక్కువ
 విశాఖ-హైదరాబాద్ మధ్య రోజూ 75 సర్వీసులు తిరుగుతుండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మరో 40 సర్వీసులు హైదరాబాద్ వెళుతున్నాయి. విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లేవారు 3 వేల మంది ఉంటారు. ఈ బస్సుల్లో 2 వేల మంది వరకూ తుని, జగ్గంపేట, రాజమండ్రి ప్రాంతవాసులు ఎక్కుతారు. ఇవికాక జిల్లా నుంచి ప్రత్యేకంగా నడిచే ప్రైవేట్ బస్సుల్లో 1600 మంది ప్రయాణికులు నిత్యం హైదరాబాద్ వెళ్తుంటారు. విశాఖ నుంచి బెంగళూరు, చెన్నై సర్వీసుల్లో రోజుకు 80 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు.
 
 నిబంధనలకు నీళ్లు
 రాకెట్‌లా దూసుకుపోయే ఓల్వో బస్సు లతో తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. ఇందువల్లే పలువురు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అలాగే రైలు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ లభించక అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారు కూడా ఈ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. బస్సులో చాలినంత మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల వద్ద కూడళ్లలో ఆపి తక్కువ దూరం ప్రయాణాలు చేసేవారిని ముందు క్యాబిన్లలో కూర్చోబెట్టి తీసుకువెళ్లడం పరిపాటిగా మారుతోంది. దీంతో క్యాబిన్‌లో డ్రైవర్‌కు ఏకాగ్రత తప్పుతోంది.
 
 పేలుడు పదార్థాల రవాణా?
 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికులనే కాకుండా అంతకు రెండింతల బరువుండే సరుకుల రవాణాకు అనుకూలంగా ఉంటున్నాయి. బస్సు టాపుమీద, కింద లగేజీ క్యాబిన్‌లో వివిధ రకాల సరుకులను భారీగా రవాణా చేస్తుంటారు. కొంతమంది ట్రావెల్స్‌వారు గూడ్స్ ట్రాన్స్‌పో ర్టును కూడా అనుబంధంగా నిర్వహిస్తున్నాయి. దీపావళి కోసం ఈ సర్వీసుల్లో మందుగుండు సామగ్రి ఎక్కువగా రవాణా అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తుని-రాజమండ్రి మధ్య యాసిడ్ పీపాలు, నిషేధిత పదార్థాలు రవాణా చేస్తుండగా పట్టుబడ్డాయి. ఇటువంటి రవాణాపై నియంత్రణ శూన్యం. ఆర్టీసీ మాదిరిగా వీటికి మార్గమధ్యంలో తనిఖీలు లేకపోవడం, ఎవరైనా తనిఖీలు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పలుకుబడి ఉన్న నేతలు తక్షణం జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగి పోతున్నాయి. రాజకీయ పలుకుబడి వల్లనే ప్రైవేట్ ట్రావెల్స్‌పై నిఘా పెట్టలేకపోతున్నామని రవాణా అధికారులు అంటున్నారు.
 
 సిబ్బంది సరిగా ఉండరు
 చాలా బస్సుల్లో ఒక డ్రైవర్, ఒక క్లీనర్ మాత్రమే ఉంటున్నారు. కొన్ని బస్సుల్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లి, మళ్లీ సాయంత్రం హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వరకూ ఒకే డ్రైవర్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం బస్సు గమ్యం చేరిన నుంచి తిరిగి రాత్రి బయలుదేరే మధ్యలో ఉన్న సమయాన్ని డ్రైవర్‌కు విశ్రాంతి సమయంగా నిర్వాహకులు చూపుతున్నారు. అయితే 24 గంటల్లో రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ సమయం ఉండాల్సి ఉండగా 16 నుంచి 22 గంటలు డ్రైవర్‌తో పనిచేయిస్తున్నారు. అలసిన డ్రైవర్లు రాత్రిళ్లు క్లీనర్లకు బస్సులు అప్పగించేస్తున్నారు.
 
 అదుపు చేయలేని వేగం
 సాధారణంగా ప్రయాణికులను తరలించే బస్సులు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. అందుకు తగ్గట్టుగా బస్సు వేగాన్ని నిరోధించాలి. కానీ జాతీయ రహదారులపై కనీసం 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బస్సులు నడుపుతున్నారు. ఈ క్రమంలో అదుపు తప్పితే నియంత్రించే సామర్థ్యం డ్రైవర్‌కు సైతం ఉండడంలేదు.
 
 ఆదేశాలు అందగానే తనిఖీలు
 ప్రైవేట్ బస్సు ప్రమాదాలపై ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదేశాలు అందిన వెంటనే తనిఖీలు చేస్తాం. మహబూబ్‌నగర్ ప్రమాదానికి వేగంతో పాటు రోడ్డు నిర్మాణం కూడా కారణంగా తెలుస్తోంది. సంఘ టన స్థలం వద్ద రోడ్డు మలుపులో సాంకేతిక ప్రమాణాల ప్రకారం నిర్మాణం జరగలేదని అక్కడి వారు చెబుతున్నారు. మలుపులో వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
 
 - సీహెచ్. హైమారావు,
 రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారి, రాజమండ్రి.
 ఇంజన్, టైర్లు కండిషన్‌లో ఉండాలి
 ఓల్వో బస్సులకు సుశిక్షితులైన డ్రైవర్ల వ్యవస్థ ఉండాలి. మా శాఖ బస్సులు గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగానికి లాక్ చేసి ఉంటాయి. డ్రైవర్లు కేవలం 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతారు. మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం అధిక వేగం వల్ల జరిగినట్టు తెలుస్తోంది. హైటెక్ బస్సులకు ఇంజన్ కండిషన్‌తో పాటు టైర్ల కండిషన్ కూడా చాలా ముఖ్యం. టైర్లు పేలినప్పుడు, అదుపులేని వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఆర్టీసీ గ్యారేజీలో వీటిని ప్రధానంగా పరిశీలి స్తాం. కండిషన్ తనిఖీ చేసి బస్సు డ్రైవర్‌కు అప్పగిస్తాం.
 - ఆర్‌వీఎస్ నాగేశ్వరరావు,
 ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీరు
 
 అంతా పైపై మెరుపే..
  ఓల్వో బస్సులు పైకి మెరిసిపోతుంటాయి. కానీ పాత ఇంజన్లతోనే దూర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. రవాణా అధికారులు మామూళ్లకు, పలుకుబడికి తలొగ్గి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్టు ఇచ్చేస్తున్నారు.
 
  ఒకే పర్మిట్‌పై రెండు మూడు బస్సులు తిరుగుతున్నాయి. పర్మిట్ ఉన్న బస్సు షెడ్‌కు వెళితే, మరో బస్సుకు నెంబరు ప్లేటు మార్చి రోడ్డు ఎక్కిస్తున్నారు. ఇలాంటి అక్రమాలపై తనిఖీలు లేవు. ఈ బస్సులను నడిపేందుకు అవసరమైన శిక్షణ డ్రైవర్లకు ఇవ్వడం లేదు.
 
  ప్రయాణికుల వివరాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదు. ప్రయాణికుల చిరునామా, ఫోన్ నెంబర్లు వంటివి విధిగా ఉండాలనే నిబంధన పాటించడం లేదు. 
 
  ప్రైవేట్ ట్రావెల్స్‌లో చాలావరకూ బినామీ పేర్లతో టిక్కెట్‌లు కొని ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రయాణికులకు అదనంగా ఒక లారీ సరుకు రవాణా చేస్తున్నారు.
  బస్సు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత దాని ఇంజన్, నిర్వహణ  వ్యవస్థ, బ్రేక్ కండిషన్ వంటివి నిపుణులతో పూర్తిగా తనిఖీ చేయించి ప్రయాణానికి సిద్ధం చేయాలి. కానీ అందుకు తగినంత సమయం ఉండడంలేదు. కేవలం బస్సులు తుడిచి మళ్లీ లైన్‌లో పెట్టేస్తున్నారు.
  రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు ఉదయం 8 గంటలకు రాజమండ్రి, మధ్యాహ్నం 11 గంటలకు విశాఖ చేరుకుంటాయి. తిరిగి సాయంత్రం ఐదు గంట లకు అదే బస్సు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతుంది. 
 
 ఏసీ బస్సుల్లో ఇవి ఉండాలి
  ఏసీ బస్సుల్లో అంతా సీల్ చేసి ఉంటుంది. ఏసీ బయటకు పోకుండా బస్సు బాడీ పొరల మధ్య పోలీయురేధిన్ ఫోం(ఒక విధమైన స్పాంజ్) వంటి పదార్థాన్ని ఉంచుతా రు. ఇది మంటలు వ్యాపించడానికి కారణం అవుతుంది.
 
  ఓల్వో బస్సుల్లో అత్యవసర సమయాల్లో అద్దాలు బద్దలు కొట్టేందుకు ఒక ప్లాస్టిక్ సుత్తి అందరికీ అందుబాటులో ఉంచాలి. ఏ బస్సులోనూ ఇది కనిపించదు.
  ప్రతి బస్సులో మొబైల్ అగ్నిమాపక పరికరం ఉంటుం ది. కానీ దాన్ని డిక్కీలో పడేస్తున్నారు. 
  బస్సు నడిచేటప్పుడు తలుపులు అన్నీ ఆటోమేటిక్ ల్యాక్ చేస్తారు. దీన్ని డ్రైవర్ ఆపరేట్ చేస్తారు. వీటిపై కొందరు డ్రైవర్లకు అవగాహన ఉండడంలేదు. అత్యవసర సమయాల్లో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి.
 
>
మరిన్ని వార్తలు