సాక్షి, ప్రొద్దుటూరు: చాగలమర్రి సమీపంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉప్పలపాడు, ఇడమడక అనే రెండు గ్రామాలు ఉన్నాయి. మధ్యలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డే రెండు గ్రామాల మధ్య హద్దు. ఎడమ వైపు ఉన్న ఉప్పలపాడు గ్రామం రాజుపాళెం మండల పరిధిలోకి వస్తే.. రోడ్డుకు కుడి వైపు ఉన్న ఇడమడక దువ్వూరు మండల పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామాల్లో ఏదైన సంఘటన జరిగినప్పుడు ఏ పోలీస్స్టేషన్కు వెళ్లాలో తెలియక ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫిర్యాదును తిరస్కరిస్తే చర్యలు..
బాధితులు ఏ స్టేషన్కు వెళ్లినా అక్కడి స్టేషన్ అధికారులు ఫిర్యాదు స్వీకరించాల్సించి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ 166–ఏ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశించి, శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మహిళలు, చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏపీలో తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ను అందుబాటులోకి తీసుకొని రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’తో పాటు మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీఎస్పీ సుధాకర్ సూచించారు. మహిళల రక్షణ సవాల్గా మారింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్ష్టేషన్కు పంపిస్తారని డీఎస్పీ అంటున్నారు.
‘జీరో ఎఫ్ఐఆర్’ అంటే..
చాలా మంది పోలీసులకు ‘జీరో ఎఫ్ఐఆర్’పై సరైన అవగాహన లేదు. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. ఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియనప్పుడు.. ఏదో ఒక పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడం. రాత్రి, పగలు ఎప్పుడైనా ఆపద సమయంలో బాధితులు స్టేషన్కు వెళ్లినప్పుడు పరిధితో నిమిత్తం లేకుండా పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించాలి. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు చెప్పిన విషయం ప్రా«థమికంగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేయాలి. సాధారణంగా స్టేషన్లోని వరుస సంఖ్యతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే వచ్చిన కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ‘జీరో’ నంబర్ కేటాయిస్తారు. తర్వాత ఆయా పోలీస్స్టేషన్కు కేసును బదిలీ చేశాక అక్కడ ఎఫ్ఐఆర్కు నెంబర్ ఇస్తారు.
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం..
స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సబ్డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశాం. బాధితులు ఏ పోలీస్స్టేషన్కు వెళ్లినా ఫిర్యాదులు తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మíßహిళలు, చిన్న పిల్లల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ.
జీరో ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు తీసుకోవాల్సిందే..
బాధితుడికి అన్యాయం జరిగితే తాను నివసించే చోటు నుంచి నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పరిధితో నిమిత్తం లేకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ ఇటీవల లోక్అదాలత్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సమగ్ర దర్యాప్తు కోసం సంబంధిత పోలీస్స్టేషన్కు బదిలీ చేయాలని తెలిపారు. ఒక బాధితుడు తమ దగ్గరికి ఫిర్యాదు చేసేందుకు రాగా సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. తీరా స్టేషన్కు వెళితే తమకు సంబంధం లేదని బాధితుడిని పోలీసులు వెనక్కి పంపించినట్లు జిల్లా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వెంట్గా ఎస్ఐ గానీ, సీఐ గానీ ఎక్కడైనా సెక్షన్ 154 సీఆర్పీసీ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలన్నారు. లేకుంటే 166ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం వారే నిందితులవుతారని స్పష్టం చేశారు.
‘దిశ’ మిస్సింగ్పై ఫిర్యాదు తీసుకోని పోలీసులు..
హైదరాబాద్లోని శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశ మిస్సింగ్ విషయంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంఘటనా స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్కు వెళ్లాలని అక్కడి పోలీసులు చెప్పినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. తర్వాత దిశను నలుగురు కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాధితుల నుంచి ఏ పోలీస్స్టేషన్కు మొదట ఫిర్యాదు వస్తే అక్కడే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.