అందర్నీ వేధించండి.. మావాళ్లను రక్షించండి

17 Dec, 2015 00:21 IST|Sakshi
అందర్నీ వేధించండి.. మావాళ్లను రక్షించండి

పోలీసులకు సర్కారు ఆదేశం
టీడీపీ నేతల కాల్‌మనీ కేసును నీరుగార్చే కుట్ర
అర్ధరాత్రి సోదాలతో హడావుడి చేస్తున్న పోలీసులు

 
మాధవధారలో ఓ వడ్డీ వ్యాపారి ఇంటిలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు జరిపారు. ఆధారాలేవీ లభించకపోయినా అతన్ని తమతో తీసుకుపోయారు. వన్‌టౌన్ పరిధిలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి మరోవైపు : ఇద్దరు బాధితురాళ్లు గుడివాడ రామకృష్ణ అనే వ్యాపారి వేధింపులపై నవంబర్‌లో ఫిర్యాదు చేసినా పోలీసుల ఉదాసీనత. సదరు వ్యాపారి మంత్రికి సన్నిహితుడు కావడం.. అధికార టీడీపీకి చెందిన వాడు కావడమే దీనికి కారణం. బాధితులు బీజేపీ ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో కేసు నమోదు చేయకతప్పలేదు. అయితే అతను పరారీలో ఉన్నట్లు చూపుతున్నారు.
 
..ఈ మూడు ఉదంతాలు పాలకుల దుర్నీతికి దర్పణం పడుతున్నాయి. విజయవాడ కాల్‌మనీ కేసులను నీర్చుగార్చేందుకు.. జనం దృష్టి మళ్లించి తెలుగు తమ్ముళ్లను రక్షించేందుకు సర్కారు పన్నిన పన్నాగంలో పోలీసులు పావులుగా.. ‘కాల్’ నాగులుగా మారి అమాయక వడ్డీ వ్యాపారులను కాటేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజంగా వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్న వారిపై చర్యలు చేపట్టకుండా.. అందరు వ్యాపారులపై దాడులకు పాల్పడటం.. ‘అందర్నీ వేధించి.. తమ వారిని రక్షించుకునే ధోరణి కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
విశాఖపట్నం:  విజయవాడలో వెలుగుచూసిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నేతల కాల్‌మనీ దురాగతాల కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. పరిమితికి లోబడి వడ్డీ వ్యాపారం  చేసే వారిపై కూడా దాడులు చేయాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టి మళ్లించి తమ నేతలను రక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.  అందర్నీ ఒకే గాటన కట్టేయడం ద్వారా టీడీపీ నేతల దురాగతాల కేసును నీరుగార్చాలన్నది అసలు పన్నాగం. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జిల్లాలో వడ్డీ వ్యాపారులను తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తూ హడలెత్తిస్తున్నారు.
 
టీడీపీ తమ్ముళ్ల కేసు నీరుగార్చేందుకే....
విజయవాడలో కాల్‌మనీ అకృత్యాలకు పాల్పడినవారికి సీఎం చంద్రబాబు, లోకేష్‌ల అండదండలు  ఉన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. దాంతో  ఈ కేసును నీరుగార్చి తమ పార్టీ నేతలను కాపాడటానికి సీఎం చంద్రబాబు పన్నాగం పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి వేధించాలని పోలీసులను ఆదేశించారు. అత్యధిక వడ్డీ వసూలు చేస్తూ వేధించేవారిని, మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ పరిమితికి లోబడే వడ్డీలు వసూలు చేసే వ్యాపారులను, వేధింపులకు గురి చేయని వారినీ వేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సందట్లో సడేమియాగా అన్ని కేసులతోపాటు విజయవాడలో టీడీపీ నేతల అకృత్యాల కేసును కూడా నీరుగార్చాలని ఎత్తుగడ వేశారు.
 
దాడులు... వేధింపులు

 సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు జిల్లాలో వడ్డీ వ్యాపారులపై విరుచుకుపడుతున్నారు. ఫిర్యాదు లేకపోయినప్పటికీ అర్ధరాత్రిళ్లు  ఇళ్లలో సోదాలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ఆధారాలు లభించకపోయినా సరే వ్యాపారులను అనధికారికంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. మాధవధారలో ఓ వడ్డీవ్యాపారి ఇంటిలో మంగళవారం రాత్రి పోలీసులు సోదలు చేశారు. అత్యధిక వడ్డ వసూలు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా ఆయన్ని తమతోపాటు తీసుకుపోయారు.  వన్ టౌన్ పరిధిలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తెల్లకాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
 
టీడీపీ నేత కేసులో ఉదాసీనత
నిబంధనల మేరకు వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిని వేధిస్తున్న ప్రభుత్వం టీడీపీ నేతలకు మాత్రం రక్షాకవచంగా నిలుస్తోంది. విజయవాడలో మాదిరిగానే విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీకి చెందిన గుడివాడ  రామకృష్ణ అనే వ్యాపారి మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది. మంత్రి అయ్యన్నపాత్రుడుకు సన్నిహితుడైన ఆయన తన వాహనానికి టీడీపీ జెండా పెట్టుకుని తిరుగుతుంటారు. ఆయన ఓ మహిళకు రూ.100కు రూ.30 వడ్డీపై అప్పు ఇచ్చారు. అప్పు తీర్చాలని లేకపోతే తన కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. బాధితురాలు నవంబర్ 21న అతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. మరో మహిళ ఇచ్చిన అప్పు తీర్చినప్పటికీ ప్రామిసరీ నోటు ఇవ్వాలంటే తన కోరిక తీర్చమని రామకృష్ణ వేధిస్తున్నారు. ఆమె కూడా నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రామకృష్ణ మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు కావడంతో పోలీసులు పట్టించుకోలేదు. విజయవాడ కాల్‌మనీ దురాగతాలు బయటపడిన తరువాత బాధితులు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజును మంగళవారం ఆశ్రయించారు. ఎమ్మెల్యే చెప్పడంతో రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆయన పరారీలో ఉన్నారని చెబుతున్నారు. అమాయకులైన వడ్డీవ్యాపారులపై ప్రభుత్వ వేధింపులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 
టీడీపీ నేతలను రక్షించుకోవడానికే..!

కాల్‌మనీ సంఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వారందరినీ ముందుగా అరెస్టు చేసి కేసు పూర్వాపరాలు పరిశీలించాలి. మిగిలిన జిల్లాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉన్నాయో నివేదిక రప్పించుకోవాలి. అంతేగానీ దాడులకు పురిగొల్పి అందరినీ పోలీస్ స్టేషన్‌కు రప్పించుకుని విచారించడం అసలు కేసును పక్కదోవపట్టించడానికే. టీడీపీ నేతలను రక్షించుకోవడానికే. కేస్ టు కేస్ పరిశీలించకుండా మొత్తం అందరినీ ఒకే రీతిన ఇబ్బంది పెట్టాలను కోవడం ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోంది. చట్టవ్యతిరేకంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న అందరినీ శిక్షించాలి. అంతే కానీ అందరికీ ఒకే శిక్ష అనడం సరైంది కాదు.
 -జేవీ సత్యన్నారాయణ మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సీపీఐ
 
 ఫిర్యాదులుంటే చర్యలు చేపట్టండి..
!
 టీడీపీ నేతల ఆరాచకాల కేసును.. పక్కదారి పట్టించేందుకే ఇలా అందర్నీ వేధిస్తున్నారు. ఫిర్యాదులుంటే వడ్డీ వ్యాపారులపై చర్యలు చేపట్టండి. ఫిర్యాదులు రాకపోతే బాధితులకు మనోధైర్యం కల్పించి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాతే కేసులు పెట్టండి. అంతే గానీ చట్టపరంగా వ్యాపారం చేసుకునే వారిపై కూడా కాల్‌మనీ ముసుగులో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరైంది కాదు. లెసైన్స్ హోల్డర్లు చట్టపరంగా చేస్తున్నారో లేదో పరిశీలించండి. బాధితుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి.
 -నండూరి రామకృష్ణ ఎంవీపీకాలనీ 12 సెక్టార్ల అధ్యక్షుడు
 

మరిన్ని వార్తలు