కాపురానికి రాలేదని...

25 Nov, 2015 03:30 IST|Sakshi

భార్యపై సైకో భర్త దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం
 సోంపేట మార్కెట్లో సంచలనం

 సోంపేట : సోంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ (బజారు)లో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ప్రబుద్ధుడు భార్యపై దాడిచేశాడు.  బ్లేడుతో ఆమె పీకను కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మార్కెట్ వ్యాపారులు,  ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. సోంపేట పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...  బీన పద్మ (23),  బీన శ్రీనివాసరావు (27)భార్య భర్తలు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన పర్రి కేశవరావు, లోలమ్మ కుమార్తె పద్మను ఒడిశాలోని ఖుర్దా రోడ్డు చెందిన శ్రీనివాసరావుతో మూడేళ్ల క్రితం వివాహంచేశారు. శ్రీనివాసరావు పెళ్లినాటి నుంచి సైకోలా వ్యవహారిస్తూ హింసిస్తున్నాడని పద్మ తల్లిదండ్రులకు చెప్పుతూ ఉండేది. తల్లిదండ్రులు సర్దుకుపోమ్మంటూ సలహా ఇస్తూ ఉండేవారు.
 
 పద్మ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు శ్రీనివాసరావు చేయి చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆరు నెలల క్రితం పద్మకు ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. అప్పటి నుంచి పద్మ కన్నవారి ఇంటి వ ద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు పద్మను కాపురానికి రావాలని కోరగా, ఆమె ససేమిరా అంది. ఆపై, ఆమె భర్త హింసను తట్టుకోలేకపోతున్నానంటూ కంచిలి పోలీస్ స్టేషన్‌లో వారం క్రితం ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై గృహహింస చట్టంపై కేసు నమోదయింది. కంచిలి ఎస్‌ఐ వేణుగోపాలరావు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో భార్యపై శ్రీనివాసరావు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద శ్రీరాంపురం గ్రామం నుంచి పద్మ తన పిన్ని సంతోషితో కలసి సోంపేట మార్కెట్‌కు రాగా, శ్రీనివాసరావు వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. తనవెంట తెచ్చుకున్న బ్లేడుతో పద్మ మెడపై, గెడ్డంపై దాడి చేశాడు. ఆపై అతడూ కంఠం పై బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరినీ స్థానికులు సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు.  సోంపేట సీఐ సూరినాయుడు భార్య, భర్తల వద్ద నుంచి వివరాలు సేకరించారు. సోంపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు