షార్ నుంచి 10న పీఎస్‌ఎల్‌వీ సీ28 ప్రయోగం

28 Jun, 2015 21:31 IST|Sakshi

శ్రీహరికోట(సూళ్లూరుపేట) :భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 10వ తేదీన పీఎస్‌ఎల్‌వీ సీ28ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక మీద నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాల అనుసంధానం మాత్రమే ఇక మిగిలివుంది.

ఈ నెల 14న కెనడాకు చెందిన డీసీఎం-3 అనే మూడు ఉపగ్రహాలు షార్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. షార్‌లోని క్లీన్‌రూంలో ఉపగ్రహాలకు ఇస్రో, కెనడా శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు పూర్తి చేసుకుని మంగళవారం సాయంత్రం ప్రయోగవేదిక వద్దకు ఉపగ్రహాలు చేరుకుంటాయి. బుధవారం ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అనుసంధానం చేసి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే పనులు చేపట్టనున్నారు. ఆ తరువాత మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు