సైకో స్వైర విహారం

16 Mar, 2020 12:50 IST|Sakshi
సులేన్‌ చేతులు కట్టి తీసుకువెళుతున్న దృశ్యం

మానసిక స్థితి సరిగా లేనివ్యక్తి వీరంగం

కానిస్టేబుల్, స్థానికులపై దాడి  

పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లులో ఒక వ్యక్తి సైకోలా వీరంగం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. విచక్షణారహితంగా పలువురిపై దాడికి పాల్పడటంతో స్థానికులు కర్రలతో అతడిని కట్టడి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు తంజావూరు నుంచి వచ్చిన కొందరు యువకులు పాలకొల్లులో జ్యూస్‌ సెంటర్‌ నడుపుతున్నారు. వారిలో ఒకడైన సులేన్‌ అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆదివారం మిత్రులతో గొడవ పడి జ్యూస్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చాడు. యడ్లబజారు సెంటర్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళ్లి శంభోశంకర అంటూ అరుచుకుంటూ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి అక్కడున్న వస్తువులను గిరాటు వేశాడు. ఇద్దరు భక్తులు, అర్చకునిపై దాడికి పాల్పడ్డాడు.

అక్క డి నుంచి బయటకు వచ్చిన సులేన్‌ రోడ్డుపై వెళుతున్న పలువురిపై దాడులకు దిగాడు. అటుగా వచ్చిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. రోడ్డుపై కనిపించిన వ్యక్తులను ఇష్టమొచ్చినట్లు కొడుతూ తన చేతులను కత్తితో చీరేసుకున్నాడు. ఎంఎంకేఎన్‌ఎం హైస్కూల్‌ వద్ద మరో వ్యక్తిపై పైసాచికంగా దాడి చేస్తుండగా స్థానికులు సులేన్‌ను కర్రలతో కట్టడి చేశారు. అనంతరం అతడిని తాళ్లతో నిర్బంధించి పోలీసుల సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సులేన్‌ మానసిక స్థితి సరిగా లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం సులేన్‌ను మిత్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు