మిమ్మల్ని చూస్తే పెద్దాయనను చూసినట్టే ఉందన్నా
వైఎస్ జగన్తో మహిళా కూలీల మాటామంతి
మన ప్రభుత్వం వస్తే పేదల బతుకులు మారేలా సంక్షేమ పథకాలు: వైఎస్ జగన్
కర్నూలు సీక్యాంప్: ‘నువ్వు ముఖ్యమంత్రి కావాలి..మా బతుకులు మారాలి జగనన్నా’ అంటూ సీడ్ పత్తి కూలీలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు విన్నవించారు. శనివారం ఉదయం 8.30కి దొర్నిపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కంపమళ్ల, ఉయ్యాలవాడ క్రాస్రోడ్డు, భీమునిపాడు గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా సీడ్ పత్తి కూలీలు వైఎస్జగన్ను కలిసి సమస్యలు ఏకరువు పెట్టారు. ‘గ్రామాల్లో ఉపాధి లేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితి మాకు దాపురించింది జగనన్నా.. నువ్వు వస్తే తప్పా మా బతుకుల్లో వెలుగులు వచ్చే ఆస్కారం లేదనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా గ్రామాల్లో అభివృద్ధి, ఉపాధి కల్ప న, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.
మిమ్మల్ని చూస్తే మీ నాయన వైఎస్ రాజశేఖర్రెడ్డిని చూసినట్లే ఉంది. ఆయన మా కూలీల బతుకులు బాగుండాలని ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు. మీరు, మీ నాన్నలానే మా పేదల జీవితాల్లో మార్పు తెస్తారనే నమ్మకం మాకుంది. అందుకే నువ్వు రావాలి అన్నా’ అని సీడ్ పత్తి మహిళా కూలీలు వైఎస్ జగన్ను ప్రేమతో ఆశీర్వదించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది. గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పథకాల అమలుకు అందరం కృషి చేద్దాం.. మీరంతా దేవున్ని ప్రార్థించండి. కూలీల బతుకులకు ఒక భరోసా ఇవ్వడానికి, నేరుగా వారి కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నా’ అని జగన్ తెలిపారు.