రాజుపాలెం
తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఆరునెలల నుంచి అల్లాడిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వచ్చారని పులిచింతల ప్రాజెక్టు నిర్వాసిత కేంద్రాల ప్రజలు అధికారులపై మండిపడ్డారు. సరస్వం కోల్పోయి అనాథల్లా ఇక్కడ ఉంటున్నామని వాపోయారు.
మండలంలో ఉన్న మూడు పునరావాస కేంద్రాలలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులపై శుక్రవారం చౌటపాపాయపాలెంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్యాదవ్ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలుత జేసీ ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, శ్మశాన వాటి కలపై సమీక్ష చేశారు. వీటిపైనే మాట్లాడాలని నిర్వాసితులను జేసీ ఆదేశించారు. ఈ సందర్భగా నిర్వాసితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
‘మీరు ఉన్నప్పుడే అధికారులు రెండు, మూడు రోజుల్లో అనీ చేస్తామని సమాధానం చెబుతారు, ఆ తరువాత కంటికి కూడా కనపడరని’అధికారుల వైఖరిని బయటపెట్టారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నామన్నారు.
పునరావాస కేంద్రాల్లో ఆరు నెలల నుంచి వీధి దీపాలు వెలగడం లేదని , పంచాయతీ అధికారులను అడిగితే తమ వద్ద నిధులు లేవని చెబుతున్నారని ఆవేశంగా అన్నారు.
సుమారు మూడువేల కుటుంబాలు తరలివస్తే ఇప్పటివరకు శ్మశానానికి స్థల సేకరణ చేయలేదని మండిపడ్డారు.
అనంతరం జేసీ మాట్లాడుతూ వారానికొకసారి కేంద్రాలను సందర్శించడానికి, ఇక్కడి సమస్యలను తీర్చడానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వచ్ఛందంగా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు క్యాంప్లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా జేసీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఢిల్లీరావు, ఆర్డీవో భాస్కరనాయుడు, ఎస్డీసీ-2 వేణుగోపాలరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాణి, డీపీవో గ్లోరియా, హౌసింగ్ పీడీ సురేష్బాబు, విద్యుత్ ఏడీ జి.సుందరబాబు, ఎస్డీసీ-1 ఝన్సీరాణి, ఆర్డబ్లూఎస్ ఈఈ వేణు, తహశీల్దారు నాగూల్సింగ్, ఎంపీడీవో భ్రమరాంబ, ఐసీడీసీ ప్రాజెక్టు అధికారి మాధురి, ఐకేపీ ఏపీఎం సునీత, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ, పిడుగురాళ్ల ,దాచేపల్లి తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.