టీడీపీ నాయకుల బరితెగింపు

25 Mar, 2019 14:03 IST|Sakshi
తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతున్న కృష్ణ నాని అనుచరుల దాడిలో పగిలిన సతీష్‌ తల

యువకులకు మద్యం తాగించి దాడులు చేయిస్తున్న వైనం

వైఎస్సార్‌ సీపీ యువతపై విచక్షణా రహితంగా దాడులు

తీవ్రంగా గాయపడ్డ యువకులు..   రుయాలో చికిత్స

చిత్తూరు, చంద్రగిరి: నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ఓటర్లను భయపెట్టైనా ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. దీనికి యువకులను మద్యం మత్తులోకి దింపి పావులుగా వాడుకుంటున్నారు. ఆదివారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సన్నిహితుడు, తిరుచానూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి అనుచరులు పదిమంది యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరిచారు. బాధితుల కథనం మేరకు... వైఎస్సార్‌సీపీకి చెందిన సతీష్, కృష్ణ, శివలతో పాటు మరో ఏడుగులు యువకులు తిరుచానూరు మాజీ సర్పంచ్‌ రామచంద్రారెడ్డి పొలం వద్ద ఉన్నారు.

అదే సమయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి తన పొలంలో టీడీపీకి చెందిన కొంతమంది యువకులకు విందు ఏర్పాటు చేశారు. ఫూటుగా మద్యం సేవించిన యువకులను శ్రీధర్‌రెడ్డి రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ యువకులపైకి పంపారు. మద్యం మత్తులో ఉన్న యువకులు వైఎస్సార్‌ సీపీ యువకులపై దాడికి తెగబడ్డారు. పరుగులు తీసినా శ్రీధర్‌ రెడ్డి అనుచరులు మాత్రం వారిని వెంబడించి, దాడులు చేశారు. ఈ దాడుల్లో యోగిమల్లవరానికి చెందిన సతీష్, చంద్రశేఖర్‌కాలనీకి చెందిన కృష్ణకు తలలు పగిలాయి. యోగిమల్లవరానికి చెందిన శివమణి ఎడమ చేతిని విరిచేశారు. మరో ఏడుగులు యువకులకు స్వల్ప గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడకు చేరుకునే లోపు శ్రీధర్‌ రెడ్డి అనుచరులు పరారయ్యారు. బాధితులను రుయా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందజేస్తున్నారు.

నాని అండతోనే..
చిత్తూరు రౌడీయిజాన్ని చంద్రగిరికి తీసుకొచ్చి న నాని అండతో శ్రీధర్‌ రెడ్డి, అతని అనుచరుల దాడులకు తెగబడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ దామినేడు ఇంది రమ్మ కాలనీకి చెందిన పలువురు యువకులపై శ్రీధర్‌రెడ్డి అనుచరులు దాడులు చేశారని, ప్రజాభిమానంతో ఓట్లు సంపాదించుకోవాలే తప్ప, ఇలా రౌడీయిజం చేసి కాదని తిరుచానూరు వాసులు మండిపడుతున్నారు. పులివర్తి నానికి ఓటుతో బుద్ది చెబుతామని వారు ఉద్ఘాటిస్తున్నారు.

మరిన్ని వార్తలు