పుష్కరయాత్రలో అపశ్రుతి

22 Jul, 2015 23:45 IST|Sakshi
పుష్కరయాత్రలో అపశ్రుతి

కారును ఢీకొన్న లారీ
లారీ డ్రైవరు,చిన్నారి దుర్మరణం
 మరో ముగ్గురికి గాయాలు

 
అనకాపల్లిరూరల్ : పుష్కరయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాఫీగా యాత్రకు కారులో వెళ్తున్న ఆ యాత్రికులను విధి విషాదంలో ముంచింది. లారీ రూపంలో మృత్యువు ఎదురైంది. ఓ డ్రైవరుని, ఓ చిన్నారినీ బలితీసుకుంది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. వివరాలివి. సింహాచలం అడవివరానికి చెందిన కామినేని కిషోర్ కుటుంబం గోదావరి పుష్కరాలకు బుధవారం వేకువ జామున కారులో బయలుదేరింది. ఇక్కడికి సమీపంలోని సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీ ఫ్లైవుడ్ కంపెనీకి సమీపంలో మహాసిమెంట్ లోడుతో ఎలమంచిలి నుంచి విజయనగరం వెళుతున్న లారీ దూసుకొచ్చింది. కారుని ఢీకొట్టి రోడ్డుపక్కనున్న చెట్టుపైకి దూసుకుపోయింది. లారీ కేబిన్ నుజ్జయింది.

దీంతో లారీ డ్రైవరు అడ్డాల రామయ్య దొర(25) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని అతి కష్టంమీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన కామినేని కిషోర్, అతని భార్య కామినేని రజని, కుమార్తెలు  శివప్రియ (12),మౌనిక(11)లను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యసేవల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చిన్నారి శివప్రియ అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. లారీ డ్రైవర్‌ది రాంబిల్లి మండలం కొత్తూరు పంచాయతీ మామిడివాడ గ్రామం. అతనికి భార్య శివశ్రీ, తండ్రి ఉన్నారు. కర్నాటకలో డ్రైవర్‌గా పనిచేస్తూ  ఇటీవల స్వగ్రామానికి వచ్చి మహా సిమెంట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. సబ్బవరం ఎస్‌ఐ చక్రధర్‌రావు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు