కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి
మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటన
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుందామని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజుతో కలిసి మండలంలోని మారుమూల గ్రామాలైన ఎస్టీ గొయిపాక, ఎస్సీ గొయిపాక, పుసాబడి, బబ్బిడి, దిగువ చోరుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం పేరుతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గిరిజన ప్రజలతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా పేదలను అష్టకష్టాలు పెట్టిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పేదల పల్లవీ ఎత్తుకున్నారన్నారు. నవరత్నాల పథకాలను కాపీ కొడుతూ..ప్రజలను మరో మారు మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మాయలో పడి మరోసారి మోసపొద్దని కోరారు.
అప్రమత్తంగా ఉండాలి...
పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా అప్రమత్తంగా ఉండాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం ఆమె గొయిపాక, పుసాబడి, బబ్బిడి, దిగువ చోరుపల్లి గ్రామాలను సందర్శించిన సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ ఏ సర్వేలో చూసిన రాబోవు ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ చెబుతుండడంతో, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీకి చెందిన ఓటర్లను రద్దు చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, జిల్లా కార్యదర్శి గోరిశెట్టి గిరిబాబు, మండల కార్యదర్శి సామల మాధవరావు, బీసీ సెల్ కన్వీనర్ జి.వెంకటరావు, వైస్ ఎంపీపీ బిడ్డిక చంద్రమ్మ, బీరుపాడు ఎంపీటీసీ కె.కళావతితో పాటు కురుపాం మండ ల కన్వీనర్ ఐ.గౌరీశంకరరావు, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మక వెంకటరావు పాల్గొన్నారు.