ప్యాపిలి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

2 Mar, 2020 14:37 IST|Sakshi

సాక్షి, ప్యాపిలి: కర్నూలు జిల్లా ప్యాపిలి బాలుర ఉన్నత పాఠశాలలో 1966–67 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడిన వారంతా ఎంతో ఉత్సాహంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత హెచ్‌ఎం చంద్రలీలమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఆనాటి ఉపాధ్యాయులు బాలసంజీవయ్య, రాణిరెడ్డి, హనీఫ్, ప్రసాద్, శివరామిరెడ్డి, ప్రసాద్, మహమ్మద్‌ సాహెబ్, శ్రీరాంశెట్టి, రమణ తదితరులను ఘనంగా సన్మానించారు. పాఠశాలకు రూ.24 వేల విలువైన బీరువాలను అందజేశారు. 53 ఏళ్ల తర్వాత తామంతా ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖలో ఏఎస్‌ఓగా పనిచేసి, రిటైర్‌ అయిన రాముడు అన్నారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో అరుదుగా వస్తాయని మహబూబ్‌ సాహెబ్‌ అన్నారు. (చదవండి: విమానం దిగింది.. ఎగిరింది..! )

మరిన్ని వార్తలు