చారిత్రాత్మక పైలాన్‌ ఆవిష్కరణ

25 Sep, 2018 06:22 IST|Sakshi
దేశపాత్రునిపాలెంలో పైలాన్‌ వద్ద జనసందోహం

విజయనగరం, శృంగవరపుకోట: దేశ రాజకీయ చరిత్రలోనే నభూతో నభవిష్యత్‌ అన్న తీరునా చారిత్రాత్మక అపూర్వ ఘట్టానికి జిల్లాలోని కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వేదికైంది. దివంగత మహానేత రాజన్న అడుగుజాడల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా దేశపాత్రునిపాలెంలో పైలాన్‌ ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో నిర్మించిన పైలాన్‌ను మధ్యాహ్నం 3.40 గంటలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఆవిష్కరణకు ముందు ప్రాంగణంలో రావి మొక్కను నాటిన జగన్‌ పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం పావురాలను ఎగురవేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చారు. పార్టీ పతాకం రంగుల్లో ఏర్పాటు చేసిన బెలూన్లను వినువీధుల్లోకి వదిలారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకరరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటరు వరుదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు