అక్టోబర్‌ 2 నుంచి నాణ్యమైన బియ్యం

21 Jun, 2020 04:48 IST|Sakshi

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ  

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ: అక్టోబర్‌ రెండో తేదీ గాంధీ జయంతి నాడు నాణ్యమైన రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. 

► రేషన్‌ బియ్యాన్ని గతంలో ప్యాకింగ్‌చేసి అందించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ప్యాకింగ్‌కి అయ్యే ఖర్చు, పర్యావరణ సమస్య వంటి కారణాలతో ఆ విధానాన్ని విరమించుకున్నాం.
► ప్యాకింగ్‌ కోసం ఏడాదికి రూ.400 కోట్లు ఖర్చవుతుంది. ఆ ఖర్చును తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేలా ఉండాలనే ఆ నిర్ణయాన్ని మార్పుచేశాం. దీనికి తోడు ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకం వల్ల పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశమూ ఉంది. 
► బియ్యం పంపిణీకి తయారు చేయించిన ట్రాలీల నమూనాలను ఇటీవల పరిశీలించి కాకినాడ జేఎన్‌టీయూకి పంపాం. అక్కడ పరిశీలించాక ఇంకా ఏమైనా మార్పులు అవసరమో కాదో తుది నిర్ణయం తీసుకుంటాం.
► రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ట్రాలీలు అవసరమవుతాయి. సరఫరా చేసేందుకు ఇప్పటికే రెండు కంపెనీలు ముందుకొచ్చాయి.

మరిన్ని వార్తలు