చీఫ్‌ విప్‌లుగా పయ్యావుల, పల్లె

12 Nov, 2017 10:08 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాసనసభ చీఫ్‌ విప్‌గా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి, శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ఎంపిక దాదాపుగా ఖరారయింది. వీరిద్దరికీ పదవులు కట్టబెడుతున్నట్లు సీఎంఓ నుంచి ఫోన్‌ చేసినట్లు సమాచారం. అయితే నియామకానికి సంబంధించిన జీఓ వెలువడాల్సి ఉంది. శాసనమండలి ఎన్నిక రోజు, లేదంటే అంతకు ముందుగానే జీఓ వెలువడనున్నట్లు తెలిసింది. పయ్యావుల కేశవ్‌ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.

 అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్‌ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్‌ పదవిని కట్టబెట్టారు. = పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్‌ విప్‌గా ఎంపికయ్యారు. అనంతపురం చరిత్రలో చీఫ్‌ విప్‌గా తొలిసారి నల్లమాడ ఎమ్మెల్యే వీరప్ప ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.. అనంతరం చీఫ్‌విప్‌లుగా పల్లె, పయ్యావుల నియమితులయ్యారు. 

మరిన్ని వార్తలు