కనికరించని ప్రభు

27 Feb, 2015 02:24 IST|Sakshi

గుంతకల్లు :  రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. గురువారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఆదాయపరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ రైళ్ల కేటాయింపుల్లో కానీ, పొడగింపుల్లో కానీ, ైరె ల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో కానీ తగినంత ప్రాధాన్యత కల్పించడం లేదన్నది ఈ బడ్జెట్‌తో అవగతమైంది.
 
  రెండు దశాబ్దాలుగా రైలే ్వ మంత్రులుగా పనిచేసిన వారంతా తమ తమ రాష్ట్రాలకు, ప్రాంతాలకు రైళ్లను, ప్రాజెక్టులను కేటాయించుకోవడంలో చూపిన చొరవ, ఆసక్తి రాయలసీమపై చూపలేదన్న వాస్తవాన్ని సురేష్‌ప్రభు పునరావృతం చేయడం సీమ ప్రజల హృదయాలను బాధిస్తోంది. రైల్వే నిధుల కేటాయింపుల విషయంలో ఎంపీలు చొరవ మచ్చుకైనా లేదన్న విషయం గురువారం నాటి  రైల్వేబడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని రైల్వే వర్గాలు, ఉన్నత స్థాయి మేధావులు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌కు వేల కోట్లు నిధులు అవసరమని డివిజనల్ స్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపితే రైల్వే మంత్రిత్వ శాఖ అత్తెసరు నిధులు కేటాయింపులు చేసి మమా అనిపించుకుంది.
 
 తాజా బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కేటాయింపులు ఇలా :
 నూతన రైలు మార్గాలు :
  నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గానికి రూ.130 కోట్లు
 మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైలు మార్గానికి రూ 185 కోట్లు
  ఓబుళవారిపల్లి-కృష్ణపట్నం రైలు మార్గ నిర్మాణానికి రూ.లక్ష కేటాయింపులు చేశారు.
  కడప-బెంగుళూరు రైలు మార్గ నిర్మాణానికి రూ. 15 కోట్లు
 కంభం-పొద్దుటూరు రైలు మార్గం నిర్మాణానికి కోటి రూపాయలు
  మద్దికెర-నంచర్ల స్టేషన్ల మధ్య బైపాస్‌లైన్ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించారు.
 డబులింగ్ రైలు మార్గాలు :
  గుంటూరు-గుంతకల్లు, గుంతకల్లు-కల్లూరు వయా గూళ్యపాళ్యం, కల్లూరు-ధర్మవరం మధ్య డబులింగ్ పనులకు రూ. 50 కోట్లు
   ధర్మవరం-పాకాల  మధ్య డబులింగ్ పనులకు     రూ 10 కోట్లు
  హోస్పేట-గుంతకల్లు మధ్య డబులింగ్‌కు రూ.10 కోట్లు
  రేణిగుంట-తిరుపతిల మధ్య డబులింగ్ పనులకు రూ 1.10 కోట్లు
  రాయచూర్-గుంతకల్లు మార్గంలో పెండింగ్‌లో ఉన్న 13 కి.మీల డబులింగ్ పనులకు రూ 6 కోట్లు
 విద్యుద్దీకరణ పనులు :
 పూణె-గుంతకల్లు మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ.250 కోట్లు
  కృష్ణపట్నం-వెంకటాచలం స్టేషన్ల మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ.5 కోట్లు
  బెంగుళూరు-గుత్తి మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ 41.16 కోట్లు
  కల్లూరు-గుంతకల్లు మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ 9.37 కోట్లు
 అభివృద్ధి పనులకు.. :
  గుంతకల్లు విద్యుత్ లోకో షెడ్ నిర్మాణానికి రూ 12 కోట్లు
 గుంతకల్లులోని ప్రభాత్‌నగర్‌లో 40 టైప్-2 క్వార్టర్ల నిర్మాణానికి రూ 5 కోట్లు
  గుంతకల్లులో క్వార్టర్స్ మరమ్మతులు, రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజీ పనులకు రూ 15 కోట్లు
 పాకాల-ధర్మవరం సెక్షన్‌లో 26 టైప్-2, 9 టైప్-3 క్వార్టర్స్ నిర్మాణానికి రూ.కోటి
  డివిజన్ పరిధిలో రైల్ లెవల్ ప్లాట్‌ఫారాలను అభివృద్ధిపరచడానికి రూ 20 లక్షలు  
  ఈ నిధుల కేటాయింపులో ప్రధానంగా మద్దికెర-నంచర్ల బైపాస్‌లైన్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాది నుంచి దక్షణాదికి వెళ్లే రైళ్లన్నీ గుంతకల్లు జంక్షన్ మీదుగా మళ్లే అవకాశం ఏర్పడుతుంది. తాజా బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా ఒక్క కొత్త రైలు కూడా పరుగులు పెట్టకపోవడం శోచనీయం.
 
 కార్మికులకు ఒరిగిందేమి లేదు
 రైల్వే బడ్జెట్‌లో కార్మికులకు ఒరిగింది శూన్యం. రైల్వే చార్జీలు పెంచలేదంటూనే ప్రీమియం రైళ్లను పెంచారు. ఈ రైళ్లలో సామాన్య ప్రయాణీకులు ప్రయాణించడం కష్టం. గత 20 ఏళ్ల రైల్వే బడ్జెట్‌లో 2002 నూతన రైళ్లను ప్రకటించారు. పట్టాలపై పరుగులు తీసినవి 1360 రైళ్లు మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం కోచ్‌ల లేమి. గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో కార్మికుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన బెనిఫిట్స్, సంక్షేమాల ఊసే మరిచారు.
 - విజయ్‌కుమార్, మజ్దూర్ యూనియన్
 గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు
 
 ఇలాంటి బడ్జెట్ ఎన్నడూ చూడలేదు
 నా సర్వీస్‌లో ఇలాంటి రైల్వే బడ్జెట్ ఎన్నడూ చూడలేదు. బీజేపీ ప్రభుత్వం రైల్వేలో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడానికి ప్రస్తుత బడ్జెట్ తార్కాణంలా నిలుస్తుంది. పీపీఓ, ఎఫ్‌డీఐలను ప్రోత్సహించి కార్మికులకు వ్యతిరేకంగా నిలిచింది. గుంతకల్లు డివిజన్‌కు ఒక్క రైలు కేటాయించకపోవడం శోచనీయం.  - కేవీ శ్రీనివాసులు, ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి
 

మరిన్ని వార్తలు