రాష్ట్రాలు దాటకుండా రైళ్లు నడిపే యోచన!

11 Apr, 2020 04:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి పరిమిత సంఖ్యలో రైళ్లను తిప్పేందుకు విధి విధానాలు నిర్దేశిస్తూ రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా రాష్ట్రాలు దాటకుండా రైళ్ల ను నడిపించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏ ఏ మార్గాల్లో రైళ్లు నడపాలనే అంశంపైనా ఉన్నతాధికారు లు కసరత్తు చేస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ గురువారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రైళ్లను ఏ మార్గాల్లో నడపాలి? ఏ విధంగా నడపాలి? అనే అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు ప్రతిపాదనల్ని రైల్వే బోర్డుకు అందించారు. అయితే దీనిపై రైల్వే శాఖ ఆదివారం నిర్ణయాన్ని వెలువరించనుంది.  

లాక్‌డౌన్‌ తర్వాత రైళ్లను నడిపినా ఫ్లాట్‌ ఫాం టికెట్ల అమ్మకాలు నిలిపేయాలని యోచిస్తున్నారు. పరిమితంగా నడిపే రైళ్లను నాన్‌ స్టాప్‌గా తిప్పాలని నిర్ణయించారు.  
► ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి.  
► ప్రయాణ సమయంలో జ్వరం వచ్చినా, కరోనా లక్షణాలు బయటపడినా మధ్యలోనే దించేస్తారు. 
► బెర్త్‌ ఖరారైన వారికే ప్రయాణం చేసేందుకు అనుమతి. 
► ఎట్టి పరిస్థితుల్లోనూ వయోవృద్ధులను రైలు ఎక్కనివ్వరు.  
► ప్రయాణ సమయానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి.  
► ప్రయాణికులంతా భౌతిక దూ రం పాటిస్తూ, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షల తర్వాతే రైలెక్కాలి.  
► గ్లౌజులు, మాస్క్‌లతోనే బోగీల్లోకి అనుమతిస్తారు. రైలు బోగీలో క్యాబిన్‌కు ఇద్దరు ప్రయాణికులనే అనుమతిస్తారు.  
► రైళ్లలో ఏవిధమైన తినుబండారాల విక్రయాలనూ అనుమతించరు.   

నేటి నుంచి సికింద్రాబాద్‌కు గూడ్స్‌ రైళ్లు 
తిరుపతి: రేణిగుంట నుంచి సికింద్రాబాద్‌కు శనివారం నుంచి రెండు గూడ్స్‌ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పార్సెల్‌ సూపర్‌వైజర్‌ అహ్మద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి గుంతకల్లు మీదుగా సికింద్రాబాద్‌కు కూరగాయలు, పండ్లతో ఒక రైలు, అరగంట వ్యవధిలో మరొక రైలు రేణిగుంట నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు బయలుదేరుతుందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు