వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు సీటింగ్

8 Apr, 2014 21:13 IST|Sakshi

హైదరాబాద్: పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించి రైల్వే  టిక్కెట్‌లు కొనుగోలు చేసినప్పటికీ  బెర్తులు లభించని  వెయిటింగ్ లిస్ట్  ప్రయాణికులకు ఇక నుంచి  సీటింగ్ సదుపాయం లభించనుంది. ఇప్పటి వరకు ఎగువశ్రేణిలోని  ఖాళీలను దిగువ  శ్రేణి ప్రయాణికులతో భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు  థర్డ్ ఏసీలో  బెర్తులు భర్తీ కాకుండా  మిగిలి ఉంటే  స్లీపర్ క్లాస్‌లోని  ప్రయాణికులకు  థర్డ్  ఏసీలో  అవకాశం  కల్పిస్తారు.

ఇందుకోసం అదనంగా చెల్లించవలసిన పని ఉండదు, అలాగే స్లీపర్‌లో  ఖాళీ అయిన బెర్తులను  వెయిటింగ్ లిస్ట్  ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే  ఇప్పటి వరకు ఇది స్లీపింగ్ సదుపాయం ఉన్న బెర్తులకే పరిమితమైంది. ఇక నుంచి  కూర్చొని  ప్రయాణించే  సీట్లు  ఉన్న ట్రైన్‌లలో,   ఏసీ చైర్ కార్,ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లలో  సైతం ఖాళీల్లో   వెయిటింగ్ లిస్ట్  ప్రయాణికులకు సీటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో  తెలిపారు.

మరిన్ని వార్తలు