రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు 

6 Jul, 2020 05:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఒడిశా, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్‌ తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఈ ప్రాంతంలో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. అల్పపీడనం ఏర్పడటంతో కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

► అల్పపీడన ప్రభావంతో.. కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. 
► ఈ నెల 7, 8 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.  
► అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ఏర్ప డటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. 
► తీరం వెంబడి నైరుతి దిశగా ఉత్తర కోస్తా తీరంలో నేడు, రేపు గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. 
► సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
► గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వానలు కురిశాయి. 
► చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరంలో 6 సెం.మీ, పార్వతీపురం, నర్సీపట్నంలో 5, సీతానగరం, చింతలపూడి, పోలవరం, తిరువూరులో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు