హైదరాబాద్: బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 4 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది.
అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, తుపాన్గా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.