కుదిపేసిన వాన.. కుదేలైన అన్నదాత

22 Sep, 2019 11:54 IST|Sakshi
బాధిత రైతులతో మాట్లాడుతున్న మేడా, ఆకేపాటి, ఆర్‌డీఓ

భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం

నీళ్లలోనే 205 ట్రాన్స్‌ఫార్మర్లు, 400 స్తంభాలు

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

బాధితులకు ఎమ్మెల్యేల భరోసా

భారీ వర్షం ఆనందం కురిపిస్తూనే మరోపక్క అన్నదాతలకు నష్టం కలిగించింది.. చాలారోజుల తర్వాత వచ్చిన వర్షం వరదలా పోటెత్తింది. ప్రవాహం ధాటికి పంటలు కాస్తా నేలపాలయ్యాయి. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గండ్లు పడి చెరువులు, కుంటలలో వరద నీరంతా కొట్టుకుపోయింది. కుంభవృష్టిలా కురిసిన వర్షానికి వాగులు.. వంకలు పోటెత్తాయి. పొలాలపై పరుగులెత్తడంతో పంటలు  నీట మునిగిపోయాయి. చాలా గ్రామాలలో రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. బ్రిడ్జిలు కనుమరుగయ్యాయి. కరెంటు స్తంభాలు నేలకూలాయి. అనుకోని నీటి ప్రవాహానికి పలువురు మృత్యువాత పడ్డారు. పాత మిద్దెలు నేలమట్టమయ్యాయి. ఈనేపథ్యంలో ప్రజాప్రతినిధులు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి భరోసానిస్తున్నారు. 

సాక్షి కడప: వరుస కరువులతో అల్లాడుతున్న అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసింది. వర్షం రూపంలో పంట పొలాల్ని దెబ్బతీసింది.  మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, ఖాజీపేట, దువ్వూరు మండలాల్లో వరి, పసుపు పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చాపాడు మండలం చు ట్టూ కుందూ ఉండడంతో అధిక నష్టం వాటిల్లింది. 2970 ఎకరాలకు పైగా వరద వల్ల నష్టపోయినట్లు అంచనా. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం, పెద్దముడియం పరిధిలో సుమారు 10 వేల ఎకరాలలో కంది, పత్తి, వేరుశనగ, వరి తదితర పంటలు దెబ్బతిన్నట్లు అధి కారులు అంచనా వేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, లింగాల మండలాల్లో 150 నుంచి 200 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నాయి. కమలాపు రం నియోజకవర్గంలోని వల్లూరు, ఇతర పలు మండలాల్లో 350నుంచి 400 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రైతులు లబోదిబోమంటున్నారు. ప్రొద్దుటూ రు పరిధిలోని రాజుపాలెంతోపాటు పరిసర ప్రాంతాల్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు వరద నీటికి దెబ్బతి న్నాయి. దీంతో రైతన్నలకు కోట్లలో నష్టం వాటిల్లింది.

తెగిపోయిన చెరువు కట్టలు
జిల్లాలో వర్షపు నీరు పోటెత్తడంతో పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి.  తొండూరులో ఒక చెరువు కట్ట తెగిపోగా....మరో చెరువుకు గండి పడింది. రాయచోటి ప్రాంతంలో పురాతన చెరువుగా గుర్తింపు పొందిన శిబ్యాల చెరువు కట్ట తెగిపోవడంతో నీరంతా వృథాగా యింది.  రాయచోటి పరిధిలో ఆరు కుం టలు తెగిపోయాయి. బద్వేలు పరిధి లోని కాశినాయన మండలంలో కూడా ఒక చెరువు కట్ట తెగిపోయింది. చాపా డు మండలాన్ని తాకుతూ కుందూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. ఇవేకాకుండా జిల్లాలో చిన్నాచితకా చెరువులు, కుంటలకు గండ్లు పడి నీరంతా ఏటిపాలైంది. ఇప్పటికీ చాపాడు మండలంతోపాట పలుచోట్ల వరద నీరు పోటెత్తుతండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రోడ్లకు అపార నష్టం
జిల్లాలో రహదారులకు భారీ నష్టం సంభవించింది. ప్రధానంగా రాష్ట్రంలో ని 24 కిలోమీటర్ల హైవేకు నష్టం జరిగింది. ఐదుచోట్ల రోడ్లు కోసుకుపోయా యి. ఏడుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నా యి. తొమ్మిదిచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, 11 చోట్ల రోడ్ల మీద నీరు పారడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాత్కాలిక మరమ్మత్తులకు సుమారు రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల మేర అవసరమవుతుందని అధి కారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 192 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 60 చోట్ల రోడ్లు కోతలకు గురి కాగా, మరో 23 చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. 25 చోట్ల రోడ్డులో కోతలు పడ్డాయి. రూ.775 లక్షలు తాత్కాలిక మరమ్మతులకు అవసరమని అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు.

ట్రాన్స్‌కోకు ఇబ్బందులు
వరద దెబ్బకు విద్యుత్‌శాకు ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికీ 205 ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలోనే ఉన్నాయి. నీరు తగ్గిపోతేగానీ వాటి పరిస్థితి తేలదు.  400 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అందులో ఎక్కువశాతం పడిపోగా మిగి లిన వాటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. 33 కేవీ లైన్లు, పెద్ద లైన్లు, ఇతర కరెంటు వైర్ల సమస్య కూడా ఏర్పడింది. భూమిలో తడి తగ్గి స్తంభాలు, వైర్ల దగ్గరికి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడితే వెంటనే రిపేర్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సింహాద్రిపురం మండలంలోని కడప నాగాయపల్లె వద్ద 15 స్తంభాలు నేలకూలాయి. కడప నగరంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు స్తంభాలకు స మస్యలు ఎదురయ్యాయి. వరద ఉధృతికి కొందరు ప్రాణాలు కోల్పోయారు.

అండగా నిలబడుతున్న ఎమ్మెల్యేలు
జిల్లాలో వరద బాధిత ప్రాంతాలలో ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటిస్తూ భరోసా నింపుతున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో నేరుగా పంట పొలాలను పరిశీలించారు. పంటలు కోల్పొయిన రైతులతో మాట్లాడారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి నెమ్మళ్లదిన్నె గ్రామానికి ట్రాక్టర్‌లో వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి....న్యాయం చేయిస్తామని ఆయా ఎమ్మెల్యేలు ప్రజలకు భరోసా ఇచ్చారు.

వరద నష్టం వివరాలు..

రహదారులకు రూ. 8–9 కోట్లు
దెబ్బతిన్న పంటల విస్తీర్ణం(అంచనా) 12–13 వేల ఎకరాలకు పైగా
తెగిన చెరువు కట్టలు, గండ్లు, కుంటలు 10–15
రాకపోకలు లేని గ్రామాలు 10
నీట మునిగినట్రాన్స్‌ఫార్మర్లు 205
పడిపోయిన, దెబ్బతిన్న స్తంభాలు 400

రోడ్లకు భారీగానే నష్టం– మరమ్మతులకు చర్యలు
జిల్లాలో రోడ్లకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. స్టేట్‌ హైవేలతోపాటు జిల్లా రహదారులు దెబ్బతిన్నాయి. కల్వర్టులు నీటి ప్రవాహంతో కోసుకుపోయాయి. రోడ్డుకు అటు, ఇటువైపు కోసుకుపోవడంతో ఇబ్బందిగా మారింది. అన్నింటినీ సిబ్బంది పరిశీలించి తెలియజేశారు. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తున్నాం.
– రమణారెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీరు, ఆర్‌అండ్‌బీ, కడప

ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం
వర్షాలతో జిల్లాలో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడ చూసినా స్తంభాలు పడిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లతో కూడా సమస్యలు వచ్చాయి ఎక్కడికక్కడ ప్రజలకు సమస్య లేకుండా కరెంటును పునరుద్దరించాం. నీటిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను పరిశీలించి ఇబ్బందులు లేకుండా చేస్తాం.  సిబ్బంది అప్రమత్తమవుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తున్నారు.
 – శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, కడప

మరిన్ని వార్తలు