రైవాడ నీళ్లు రైతులకే..

4 Sep, 2018 06:54 IST|Sakshi

పోలవరం పూర్తి చేసి రైతులకు మేలు చేస్తా

చక్కెర ఫ్యాక్టరీలకు చేయూతనిస్తా.. అన్ని విధాలా ఆదుకుంటా..

కె.కోటపాడు సభలో వైఎస్‌ జగన్‌ వరాల జల్లు

సాక్షి, విశాఖపట్నం: ‘మహానేత మాదిరిగానే ప్రతి రైతుకు మేలు చేస్తా.. నాన్న కలలు కన్నట్టుగా ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కుటుంబాలకు చేయూతనిస్తా’నంటూ జననేత ప్రజల హృదయాలను దోచుకున్నారు. మహానేత పాలన తర్వాత తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లా రైతాంగానికి ఆయన మళ్లీ ఆశల ఊపిరిలూదారు. మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడమే కాదు.. సహకార రంగంలో ఫ్యాక్టరీలకు జవసత్వాలు కల్పిస్తామని భరోసానిచ్చిన జగన్‌మోహనుడు మన ప్రభుత్వం రాగానే రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తానంటూ అభయమిచ్చారు. మాడుగుల నియోజక వర్గం కె.కోటపాడు మూడు రోడ్ల కూడలిలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగసభలో రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఓ పక్క చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ మరో వైపు రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు చేసే ఎన్నో విషయాలను ప్రకటించారు.

రైతన్నకే ప్రాధాన్యం
‘రైవాడ రిజర్వాయర్‌ నీటిని దశాబ్దాలుగా విశాఖకు తరలిస్తున్నారు. ఈ నీళ్లు పూర్తిగా రైతులకు అందిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. మన ప్రభుత్వం రాగానే పోలవరం పూర్తి చేసి రైవాడ నీళ్లను పూర్తిగా ఈ ప్రాంత రైతులకే దక్కేలా చేస్తా, అంతేకాదు ప్రాజెక్టు ఆయకట్టును కూడా పెంచుతాన’ంటూ వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటన రైతులకు పట్టరాని ఆనందం కలిగించింది.

చోడవరం ఫ్యాక్టరీని ఆదుకుంటా..
24 వేలమంది రైతులకు జీవనాధారమైన చోడవరం చక్కెర ఫ్యాక్టరీ ఆదుకుంటానని జననేత హామీనిచ్చారు. 2003లో చంద్రబాబు హయాంలో రూ.45 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీని వైఎస్‌ తన పాలనలో ఆధునికీకరించడమే కాదు..ఆ నష్టాలను పూడ్చి రూ.45 కోట్ల లాభాల బాట పట్టించారని, మళ్లీ చంద్రబాబు పాలనలో ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని వివరించారు. ఇలా ఫ్యాక్టరీని నష్టాల బాట పట్టిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడేనా అని ప్రశ్నించినప్పుడు మాకొద్దీ బాబు అంటూ రైతులు రెండు చేతులు ఊపుతూ బిగ్గరగా నినాదాలు చేశారు.

నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ
ప్రతి అక్కకు చెల్లమ్మను లక్షాధికారిని చేయాలన్న నాన్నగారి స్పప్నాన్ని నిజం చేస్తానని జననేత భరోసా ఇచ్చారు. బేషరతుగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు మాట తప్పడంతో నేడు వడ్డీతో వారి అప్పు రూ.21,600 కోట్లకు చేరిందన్నారు. ఎన్నికల నాటికి వాళ్లకు ఉన్న అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారి చేతికే ఇస్తానని హామీ ఇస్తున్నానని ప్రకటించడంతో మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇసుక దోపిడీతో రోడ్లు అధ్వానం
తాను వచ్చే దారిలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్రజలు చెప్పిన విషయాన్ని వివరిస్తూ.. చోడవరం–దేవరాపల్లి, దేవరాపల్లి–కొత్తవలస, చోడవరం–కోటపాడు వయా గవరవరం రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పారు. అడ్డగోలుగా దోచేస్తున్న ఇసుకను ఈ రోడ్లపై అడ్డూ అదుపు లేకుండా రవాణా చేయడం వలన ఎక్కడపడితే అక్కడ గుంతలు పడ్డాయని, కనీసం వాటిని పూడ్చలేదని విమర్శించారు. మాడుగులలో మంజూరైన డిగ్రీ కళాశాలకు నాలుగేళ్లుగా భవనాలు నిర్మించలేదన్నారు.

నీరు చెట్టు పథకంలో ముసిడిపల్లి, నాగరాయిచెరువు, ఎ.కొత్తపల్లి, రెడ్డివారి పెద్దచెరువు, కొత్తచెరువుతో సహా కె.కోటపాడు మండలంలో ఉన్న చెరువులన్నీ పొక్లెయిన్లు పెట్టి తాటిచెట్లంత లోతు తవ్వేసి మట్టిని దోచుకుంటున్నారని, బిల్లులు డ్రా చేసి సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. మాడుగుల మండలం బొడ్డేరులో పెదకళ్యాణం ఆనకట్ట హుద్‌హుద్‌ తుఫాన్‌కు తెగిపోతే నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షే మ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి ఆ గ్రామంలోని 10మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు వీటి ద్వారా ఎలాంటి సిఫా ర్సుల్లేకుండా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే ఏది కావాలన్నా ఉచితంగా అందిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు