రాజమండ్రి కల్చరల్, న్యూస్లైన్ : తెలుగు సినీ జగత్తులో హాస్యం ఉన్నంత కాలం రాజబాబు మన హృదయాలలో చిరంజీవిగా ఉంటాడని రాజబాబు సోదరుడు చిట్టిబాబు అన్నారు.
రాజబాబు 78వ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం గోదావరి ఒడ్డున గల ఆయన విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో చిట్టిబాబు మాట్లాడారు. నాటి హీరోలతో సమానంగా పారితోషికాన్ని అందుకున్న రాజబాబు మానవతావాది అని, ఆపదలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేశారని చిట్టిబాబు పేర్కొన్నారు.
‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ ‘మా అందరికీ ఆయన అన్నవంటి వాడు, ఆదర్శ కళాకారుడు రాజబాబు. ఆయన హాస్యం అందరినీ అలరించేది’ అని పేర్కొన్నారు. రాజబాబు విగ్రహానికి గజమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదసాదలకు ఆహారం వితరణ చేశారు. రాజబాబు మేనల్లుడు కవివరపు శ్రీనివాస్, బాబులు, బాబి, రాజబాబు అభిమానులు పాల్గొన్నారు.