వీడి వెళ్లాల్సిందేనా!

1 Jun, 2014 00:16 IST|Sakshi

కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో ఉద్యోగులను స్థానికత ఆధారంగా బదిలీ చేస్తుండడంతో జైళ్ల శాఖ ఉద్యోగుల్లో గుబులు పుడుతోంది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్న తెలంగాణ ఉద్యోగులకు.. ‘విభజన ప్రక్రియ’ శాపంగా మారింది. కొంతమంది ఉద్యోగులు ఇక్కడే ఉద్యోగాలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ అలవాటు పడిన ఉద్యోగులు తెలంగాణ వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ఈ బదిలీల వల్ల పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని, బదిలీపై వెళితే అక్కడ వసతి, పిల్లల చదువులు కష్టంగా మారుతాయని ఉద్యోగులు చెబుతున్నారు. పిల్లల చదువులు పూర్తయ్యే వరకు ఇక్కడ ఉంచాలంటే కుటుంబం ఒకచోట, పిల్లలు వేరేచోట ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు తప్పనిసరి కాకుండా ఉద్యోగుల అభీష్టానికి విడిచిపెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 ఇప్పటికే 120 మంది బదిలీ
 రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో వార్డర్లుగా పనిచేస్తున్న 120 మంది తెలంగాణ వారిని ఇప్పటికే బదిలీ చేశారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే నాటికి కోస్తా రీజియన్ పరిధిలో మరో 50 మంది తెలంగాణ ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉందని కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే ఈ బదిలీలు ఖాయమన్నారు. అపాయింటెడ్ డే నాటికి రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కె.న్యూటన్, మరో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ల బదిలీ ఖరారైంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడితే మరింత మంది బదిలీలు జరుగుతాని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
 

మరిన్ని వార్తలు