ప్రత్యేకహోదాపై జగన్‌ చెప్పిందే సత్యం

23 Jul, 2018 12:20 IST|Sakshi
మాట్లాడుతున్న రాజంపేట మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ

పెనగలూరు: ప్రత్యేకహోదాపై  నాలుగున్నర సంవత్సరాల నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలే సత్యమని తేలిందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ పేర్కొన్నారు. కొండూరులో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై జగన్‌ ఏమైతే ప్రజలకు చెప్పారో.. అవే మాటలు పార్లమెంటులో గల్లా జయదేవ్‌ ఇంగ్లిష్‌లో చెప్పారన్నారు. జగన్‌ చెప్పిన మాటలు అప్పుడు కాదనుకున్న టీడీపీ ఇప్పుడు అవే మాటలు పార్లమెంటులో చెప్పడం చూస్తే జగన్‌ మాటలే సత్యమని తెలుస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినరోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఉండి కూడా ప్రత్యేకహోదాపై విఫలం చెందారని ఆమె విమర్శించారు.  ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ చెపుతుంటే టీడీపీ కనీసం నిరసన కూడా తెలుపకపోవడం దారుణమన్నారు.

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్‌ను విమర్శించడం మానుకుని,  ప్రత్యేకహోదా కోసం పోరాడాలని ఆమె హితవు పలికారు. అలాగే ఈనెల 24న వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్‌లో టీడీపీ కూడా పాల్గొనాలని కోరారు. ప్రత్యేకహోదా అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నమ్మకాన్ని ప్రతి పార్టీ నిలబెట్టేలా కృషి చేయాలన్నారు. అలాగే మంగళవారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌ను రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రభావతమ్మ కోరారు. కార్యక్రమంలో పెనగలూరు జెడ్పీటీసీ విజయ్‌రెడ్డి,  వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ కేతా చక్రపాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు