'7వ తేదీన హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ'

31 Aug, 2013 15:24 IST|Sakshi

హైదరాబాద్ : సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, జేఏసీ నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నుంచి హామీ ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదేనని వారు అన్నారు. తెలంగాణ మంత్రులతో భేటీ అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టకుండా నాన్చటం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు.

 

తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన ప్రభుత్వం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కట్టడి చేయకపోవటం సరికాదని జేఏసీ నేతలు అన్నారు. మొదట నుంచి తెలంగాణపై ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని వారు వ్యాఖ్యానించారు.  ఏడో తేదీన తెలంగాణ సాధన ర్యాలీ సిటీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు దాకా జరుగుతుందన్నారు. ఒకటిన గ్రేటర్ హైదరాబాద్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్, 4న కరీంనగర్, 5న వరంగల్, 6న మహబూబ్‌నగర్‌ల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు