మా అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది
మీరిచ్చే పింఛన్తోనే అమ్మను చూసుకుంటున్నాను
సీఎం వైఎస్ జగన్ వద్ద కన్నీటి పర్యంతమైన రమ్య
బాలిక తల్లి అనారోగ్య సమస్య వివరాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం
సాక్షి, అమరావతి: ‘మా అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడు తోంది. ఇలాంటి కష్టకాలంలో నేను మా అమ్మను మీరిచ్చే పింఛన్తో చూసుకుంటున్నాను. నేను లేకపోయినా నీకు మామయ్య (జగన్) ఉన్నాడని మా అమ్మ నాకు చెపుతుందని కృష్ణాజిల్లా కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రమ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద కన్నీటిపర్యంతమైంది. దీంతో చలించిన ముఖ్యమంత్రి.. బాలిక తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యా రంగంపై జరిగిన మేధోమథన సదస్సుకు వచ్చిన రమ్య ఏం మాట్లాడిందంటే..
► సీఐడీ ఆఫీసర్ కావాలన్నది నా కల. దాన్ని చేరుకోలేనేమోనని భయపడేదాన్ని.
► మామయ్యలా మాకు అండగా ఉంటానన్న మీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. మా నాన్నగారు లేరు. అమ్మ కూలి పనిచేసుకుని నన్ను చదివించేది.
► మీరిచ్చిన ‘అమ్మఒడి’ డబ్బులు వచ్చాయి. నాలాంటి పేదవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.
► అమ్మ ప్రేమ ముద్ద మా జగనన్న గోరుముద్ద.
► ఇలాంటి ఫుడ్ పక్కవాళ్లు తింటుంటే.. పెళ్లిళ్లలో చూశాం. కానీ, మేం ఇప్పుడు తింటున్నాం.
► వియ్ ఆర్ లక్కీ సార్. ఐ యామ్ ప్రౌడ్ టు బి లివింగ్ ఇన్ ఏపీ అండర్ యువర్ రూల్ సార్.
► కంటివెలుగు ద్వారా మా స్కూల్లో కంటి పరీక్షలు చేయించుకున్నాం.
► నాడు–నేడు ద్వారా నాడు పాఠశాల వేదనను చూశాం.. నేడు జగనన్న పాలనలో హరివిల్లును చూస్తున్నాం. బాత్రూంలు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది.. అని రమ్య తన ప్రసంగం ముగించింది. అనంతరం జోక్యం చేసుకున్న సీఎం జగన్.. రమ్య తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు అడిగి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.