మైనర్ బాలికపై అత్యాచారయత్నం

8 Sep, 2013 23:43 IST|Sakshi
పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్: అభం శుభం తెలియని ఓ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇస్నాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం... ఒడిషా రాష్ట్రంలోని బాజీపూర్ గ్రామానికి చెందిన చెందూర్(21) స్థానికంగా ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇస్నాపూర్‌లోని ఓ భవనంలో అద్దెకుంటున్నాడు. అయితే పక్క పోర్షన్‌లో భార్యాభర్తలు తమ కూతురు(5)తో కలిసి ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. 
 
 వారి కూతురు ఓ ప్రైవేట్ స్కూల్‌లో యూకేజీ చదువుతుంది. కాగా ఆదివారం సాయంత్రం అదే భవనంలో వేరే పోర్షన్‌లో ఉంటున్న బాలికతో కలిసి ఆడుకుంటుండగా చెందూరు వారిద్దరిని ఇంట్లోకి పిలిచి తలుపులు వేసి సదరు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అదే సమయంలో మరో చిన్నారి తల్లి తమ పాప కోసం వెతుకుతుండగా చెందూరు ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి. దాంతో ఆమె తలుపులు బాదడంతో చెందూరు తలుపులు తెరిచాడు. ఈ విషయాన్ని ఆమె సదరు పాప తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెందూరును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
 
మరిన్ని వార్తలు