23.89 లక్షల కార్డులకు రేషన్‌ బంద్‌

7 Feb, 2018 03:16 IST|Sakshi

పేదలకు పల్స్‌ సర్వే షాక్‌

వివరాలు నమోదు చేసుకోని వారికి మార్చి నుంచి సరుకులు నిలిపివేత

రేషన్‌ దుకాణాల వద్ద నోటీసులు అతికించిన డీలర్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 23.89 లక్షల మంది తెల్లరేషన్‌ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సబ్సిడీ సరుకులు అందే పరిస్థితి కనిపించటం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బహిరంగంగా ప్రకటించడంతో పేదల్లో ఆందోళన మొదలైంది. ‘ప్రజా సాధికార సర్వే (పల్స్‌)లో నమోదు చేసుకోని కార్డుదారులకు మార్చి నెల నుంచి రేషన్‌ నిలిపివేయబడుతుంది’ అని పలు రేషన్‌ దుకాణాల వద్ద నోటీసులు అతికించారు. పల్స్‌ సర్వేలో ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకోని తెల్లరేషన్‌ కార్డుదారులు ఈ నెలాఖరులోగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్లి వివరాలు అందచేయాల్సి ఉంటుంది.

లేదంటే వచ్చే నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకులు ఇవ్వబోమని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల తెల్ల రేషన్‌ కార్డులుండగా 23.89 లక్షల మంది కార్డుదారులు ప్రజా సాధికార సర్వేలో వివరాలను నమోదు చేసుకోలేదని గుర్తించారు.

మరిన్ని వార్తలు