ఈకేవైసీ నమోదుకు రేషన్‌ డీలర్ల విముఖత

11 Aug, 2019 10:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెల్లరేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు చేసేందుకు పలువురు రేషన్‌ డీలర్లు విముఖత చూపుతున్నారు. వారికి   బిజీగా ఉన్నామని, తర్వాత రావాలంటూ రోజుల తరబడి తిప్పుకుంటూ చుక్కలు చూపుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ప్రయోజనం కన్పించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.47 కోట్ల తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో 4.16 కోట్ల మంది పేర్లు (యూనిట్లు) నమోదై ఉన్నాయి. రేషన్‌ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేసినప్పటికీ 72 లక్షల మంది (యూనిట్లు) ఇప్పటికీ ఈ–పాస్‌ మిషన్లలో ఈకేవైసీ నమోదు చేసుకోలేదు. దీంతో వీరికి సంబంధించిన వేలిముద్రల వివరాలు అందుబాటులో లేవు. ఈ కారణంగా ఇందులో చాలా మంది తిరిగి మరోచోట తెల్ల రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఒక్కో కుటుంబానికి రెండు మూడు రేషన్‌ కార్డులు కూడా ఉన్నాయి. ఇలాంటి వారు రెండు మూడు కార్డులకు కూడా సబ్సిడీ బియ్యం తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేసుకోనందున అనర్హుల చేతుల్లో కార్డులు ఉండి అర్హులైన పేదలకు అందకుండా పోతున్నాయి.

మరిన్ని వార్తలు