జన జాగృతి

18 Sep, 2018 15:08 IST|Sakshi

సరికొత్త కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ శ్రీకారం

జిల్లాలో ప్రారంభమైన ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’

నవరత్నాలపై విస్తృత ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమైన పార్టీ శ్రేణులు

పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ లక్ష్యాలను వివరిస్తూ.. నవరత్నాల ప్రయోజనాలను జనానికి వివరించేందుకు ’రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ నినాదంతో ముందుకు సాగుతోంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతు న్నారు. చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గడప గడపకు వెళ్లి జనాన్ని జాగృతం చేస్తున్న ఈ కార్యక్రమానికి తొలిరోజు విశేష స్పందన లభించింది.

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: జిల్లాలో సోమవారం రావాలి జగన్‌–కావాలి జగన్‌ పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించారు. ఈ పథకాలతో  వివిధ వర్గాల ప్రజలకు జరిగే మేలును తెలియజెప్పారు. తొలిరోజు సమన్వయకర్తలతో పాటు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

మార్కాపురం నియోజకవర్గం మొద్దులపల్లి, పెదయాచవరంలలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలు పంచి, ప్రచారం నిర్వహించారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం చాట్లమడలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.
కందుకూరు వాసవీనగర్‌లో మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి కరపత్రాలు పంపిణీ చేసి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు.
చీరాల రూరల్‌ మండలం ఈపురుపాలెం సీతారామమ్మపేటలో సమన్వయకర్త యడం బాలాజీ ఆధ్వర్యంలో గడప గడపకూ వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
గిద్దలూరు నియోజకవర్గపరిధిలోని సంజీవరాయనిపేటలో సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది.  
సంతనూతలపాడు శివాలయంలో పార్టీæ సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకర్‌బాబు పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం చలపాలెం, రుద్రవరం, లక్షీపురం, కొనగానివారిపాలెంలలో ప్రచారం నిర్వహించారు.
పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం కొనికి పంచాయతీ కట్టావారిపాలెంలో పార్టీ సమన్వయకర్త రావి రామనాథంబాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు  పంపిణీ చేసి పార్టీ కార్యక్రమాలు వివరించారు.
అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం గుంటుపల్లిలో పార్టీ సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య  పార్టీ ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు.
కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని శంఖవరంలో పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు