కర్నూలులో పవన్‌కు నిరసన సెగ

13 Feb, 2020 04:39 IST|Sakshi
ఉద్యమకారులను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

అడ్డుకోబోయిన యువజన, విద్యార్థి జేఏసీ నేతలు

నల్లజెండాలతో న్యాయవాదుల నిరసన 

కర్నూలు/కర్నూలు టౌన్‌:  కర్నూలు పర్యటనలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. బుధవారం కర్నూలు పర్యటనకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు జేఏసీ నాయకులు కలెక్టరేట్‌ వద్ద నుంచి రాజ్‌విహార్‌ సెంటర్‌కు ర్యాలీగా వెళ్లారు. అయితే గాంధీ విగ్రహం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ రాయలసీమ ప్రజలను గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి సిగ్గులేకుండా పోలీస్‌ బలగాలతో బాలిక కేసును అడ్డుపెట్టుకుని కర్నూలుకు వచ్చారని మండిపడ్డారు.

ఆయనకు అమరావతిపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని దుయ్యబట్టారు.  కాగా, జేఏసీ నేతలతో పాటు మరో వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు. మరోవైపు పవన్‌ సభలో ప్రసంగిస్తుండగా న్యాయవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.  సభలోకి చొచ్చుకొని వస్తుండగా పోలీసులు అడ్డుకుని రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 
 

మరిన్ని వార్తలు