ఘనంగా ఆర్‌యూ వార్షికోత్సవం

24 Mar, 2017 16:18 IST|Sakshi

కర్నూలు (ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీ తొమ్మిదో వార్షికోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. ఆర్‌యూ ప్రిన్సిపల్‌ కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, వైస్‌ చాన్సలర్‌ ఆచార్య వై.నరసింహులు, కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామ్‌ప్రసాద్‌లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వీసీ నరసింహులు వర్సిటీ అభివృద్ధిపై కీలకోపన్యాసం చేశారు. ఎమ్మెల్సీ డేటాసైన్స్‌ విద్యార్థులు మొబైల్‌ ఆప్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.

త్వరలోనే త్రి డైమన్షల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ కోర్నుసను ఆర్‌యూలో ప్రవేశపెడతామన్నారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. కర్నూలు మెడికల్‌ కళాశాలలలో జరుగుతున్న సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సాయంత్రం 6 గంటలకు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి.

మరిన్ని వార్తలు