పూర్తి వివరాలు ఇవ్వండి: ఆర్‌బీఐ

26 Jul, 2014 03:43 IST|Sakshi

* రుణాల రీ షెడ్యూల్‌పై మరింత సమాచారం కోరిన ఆర్‌బీఐ
* ఎస్‌ఎల్‌బీసీ సహకారం కోరిన  హైదరాబాద్ ఆర్‌బీఐ శాఖ
* ముందు రీషెడ్యూల్‌కు అనుమతి కోసం ఆర్‌బీఐకి లేఖ రాయనున్న సీఎం బాబు

 
 సాక్షి, హైదరాబాద్: రుణాల రీషెడ్యూలు విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రాష్ట్రం నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడింది. గత ఖరీఫ్‌లో కరవు, తుపాను ప్రభావిత మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం కోరుతుండగా.. ఆ మండలాల్లో రుణాల రీ షెడ్యూల్‌ను అనుమతించడంపై ఆర్‌బీఐ(ముంబాయి) మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వివరాలను పంపాల్సిందిగా హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ శాఖను కోరింది. మండలాల వారీగా రుణాల మంజూరు వివరాలతో పాటు.. సాగు చేసిన పంటలు, వాటికి మంజూరు చేసిన రుణాలు, ఆ పంటల దిగుబడి.. తదితర వివరాలను అందించాల్సిందిగా స్థానిక ఆర్‌బీఐ శాఖను కోరింది.
 
 దాంతో ఆ వివరాలు అందివ్వాల్సిందిగా స్థానిక ఆర్‌బీఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ)ని కోరడంతో వారు రాష్ట్రంలోని వివిధ బ్యాంకు బ్రాంచీలను ఆ సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రెండు మూడు మండలాలకు చెందిన రుణాల మంజూరు వివరాలు మాత్రం ఉన్నాయని బ్రాంచీలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా మంజూరు చేసిన రుణాల వివరాలను మాత్రం ఇవ్వగలమని, మండలాల వారీగా ఆ వివరాలివ్వలేమని బ్యాంకర్ల కమిటీ హైదరాబాద్‌లోని ఆర్‌బీఐకి లేఖ రాసింది.
 
 ముందు అనుమతివ్వండి!
 మండలాల వారీగా రుణాల మంజూరు సమాచారం అందే వరకు ఆర్‌బీఐ నుంచి రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీంతో మండలాల వారీ సమాచారం అంతా ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని, తొలుత రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌బీఐకి లేఖ రాయాలని భావిస్తున్నారు.
 
 గత ఖరీఫ్‌లో కరవు, తుపాను ప్రభావిత ప్రాంతాలుగా 572 మండలాలను ప్రకటించామని, అయితే 90 రోజుల దాటిన తరువాత జీవో విడుదల చేశామని, ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదని, ఇదే సమయంలో ఒరిస్సాలో కూడా తుపాను వచ్చిందని, అక్కడ రుణాలు రీ షెడ్యూల్ చేశారని ఆర్‌బీఐకి రాయనున్న లేఖలో సీఎం వివరించనున్నారు. రుణాలు రీ షెడూల్‌కు అనుమతిం చాలని, 572 మండలాల్లో రుణాలు 10,500 కోట్ల రూపాయలున్నాయని బాబు వివరించనున్నారు.

>
మరిన్ని వార్తలు