పీహెచ్‌సీల సందర్శన తప్పనిసరి

2 Mar, 2019 08:25 IST|Sakshi
మాట్లాడుతున్న ఆర్‌డీ సావిత్రి

వైద్యాధికారుల సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ డాక్టర్‌ సావిత్రి

శ్రీకాకుళం అర్బన్‌:  జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలను తప్పనిసరిగా సందర్శించి, వాటి వివరాలు నెలాఖరులోగా టూర్‌ డైరీ రూపంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపాలని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సావిత్రి ఆదేశించారు. శ్రీకాకుళంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడ్వాన్స్‌ టూర్‌ ప్రోగ్రాం(ఏటీపీ), టూర్‌ డైరీని గత నెలలో జరిగిన ఫీల్డ్‌ విజిట్‌ వివరాలు, ఒక నెలలో 15 నుంచి 20 రోజులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలను సందర్శించి వాటి వివరాలు అందజేయాలన్నారు.

సెలవు రోజుల్లోనూ, ఆదివారాలలో వైద్యాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పీహెచ్‌సీల్లో ఓపీ చూడాలని సూచించారు.
 పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్ట్‌ జిల్లాలో జరుగుతున్న అమలు తీరు, ప్రతి స్కానింగ్‌ సెంటర్‌కు సంబంధించి ఫారం–ఎఫ్‌ రిపోర్టును జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ప్రతినెలా 5 లోగా పంపాలన్నారు. వైద్యాధికారులు తమ పరిధిలోని స్కానింగ్‌ సెంటర్లను పర్యవేక్షించాలని, ఆర్‌బీఎస్‌కే, రిఫరల్‌ సర్వీసెస్, చైల్డ్‌ హెల్త్, అబార్షన్స్‌ తదితర వాటిపై వివరంగా తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.చెంచయ్య మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి సమయపాలన పాటిస్తూ తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్‌లో ఉండాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఆర్‌టీసీ(ఎం) డాక్టర్‌ ఉమాసుందరీదేవి, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వై.కామేశ్వరప్రసాద్, డీఐఓ డాక్టర్‌ బగాది జగన్నాథరావు, జెబీఏఆర్‌ డాక్టర్‌ ఎం.ప్రవీణ్, పీఓడీటీటీ డాక్టర్‌ చింతాడ కృష్ణమోహన్, ఏఓ పి.చిట్టిబాబు, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ప్రతినిధులు ఎం.మురళీధరరావు, ఎం.వెంకటేశ్వర్రావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు