ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌: సీఈసీ

1 May, 2019 22:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్టు సీఈసీ వెల్లడించింది. ఈ నెల 6వ తేదీన  రీపోలింగ్‌ జరపనున్నట్టు తెలిపింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ జరగనుంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్‌ కేంద్రం, నెల్లూరు  జిల్లాలోని సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్‌ కేంద్రం, ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కలనూతలలో ఉన్న 247వ పోలింగ్‌ కేంద్రాలలో రీపోలింగ్‌ నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది.

ఈవీఎంల్లో తలెత్తిన లోపాల కారణంగా ఈ ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ కోరుతూ స్థానిక కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి నివేదికలు పంపిన సంగతి తెలిసిందే. వీటిని పరిశీలించిన ద్వివేదీ ఈ ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. అయితే ఆ సిఫార్సును పరిశీలించిన సీఈసీ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు