ఏసీబీ వలలో పెద్ద లంచావతారాలు

10 Jun, 2017 02:23 IST|Sakshi
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఈసీఎస్‌ అధికారులు
- వారి నుంచి రూ.10 లక్షల నగదు, చెక్కులు స్వాధీనం
 
ఉక్కునగరం (గాజువాక): ఏసీబీ వలలో పెద్ద లంచావతారాలు పడ్డాయి. కరెంటు ఫేజ్‌ మార్చడానికి రూ. లక్షలు లంచం డిమాండ్‌ చేసిన ఇద్దరు గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌) అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. వారి వద్ద నుంచి నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. పరవాడ బోనంగిలో సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌కు చెందిన టూ ఫేజ్‌ కరెంటును త్రీ ఫేజ్‌గా మార్చేందుకు పాఠశాల యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయంపై ఆర్‌ఈసీఎస్‌ కశింకోట అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ (ఏడీఈ) నక్కా సురేష్, పరవాడ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) దాసరి శివశంకర్‌ ప్రసాద్‌ మొదట రూ. 14 లక్షలు డిమాండ్‌ చేశారు.

లంచం ఇచ్చుకోలేమని బతిమాలగా రూ. 9 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని అధికారులు చెప్పారు. దీంతో పాఠశాల చైర్మన్‌ పి.సూర్యనారాయణరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సలహా మేరకు గురువారం వారు అడిగిన రూ.3 లక్షలు నగదు, రూ.1.20 లక్షలు చొప్పున ఐదు చెక్కులను సిద్ధం చేయగా.. ఆ విషయం తెలిసిన ఇద్దరు అధికారులు సరాసరి స్కూల్‌ చైర్మన్‌ ఇంటికే వచ్చేశారు. అక్కడకు చేరుకున్న ఏసీబీ డీఎస్‌పీ రామకృష్ణప్రసాద్‌ నేతృత్వంలో సిబ్బంది అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ అధికారులను వెంటనే అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ రామకృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ లంచం కేసులో పట్టుకున్న అతి పెద్ద కేసు ఇదే అన్నారు. నగదుతో పాటు చెక్కులు తీసుకోవటం ఆశ్చర్యకరమన్నారు. 
మరిన్ని వార్తలు